ఆర్టీసీ కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారం కోసం టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ మధ్యవర్తిత్వం నెరపాలని ఆర్టీసీ వర్కర్స్ ఎడ్యూకేషన్ సెంటర్ కార్యనిర్వాహక కమిటీ ఒక లేఖలో కోరింది.
విధాత : ఆర్టీసీ కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారం కోసం టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ మధ్యవర్తిత్వం నెరపాలని ఆర్టీసీ వర్కర్స్ ఎడ్యూకేషన్ సెంటర్ కార్యనిర్వాహక కమిటీ ఒక లేఖలో కోరింది. గత బీఆరెస్ పాలకులు ఆర్టీసీ కార్మికుల రాజ్యాంగ బద్ద హక్కులను లాగేసుకుని, సంస్థను నిర్వీర్యం చేసిందని , దీంతో ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా కార్మికులు పనిచేశారన్నారు.
అయితే ఆరునెలలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపైన, యూనియన్ల పునరుద్ధరణపై మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తుందని ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డికి చెందిన సంస్థ బస్సులను రేవంత్ ప్రభుత్వం కూడా ఎర్రతీవాచి పరిచిందని, కాంగ్రెస్ వస్తే కొలువుల జాతర అని చెప్పి వెల్ఫర్ బోర్డులను రద్ధు చేసిందని విమర్శించారు.
యూనియన్ల పునరుద్దరణ చేయకపోగా, సంస్థకు లాభాసాటిగా ఉన్న కార్గో, పాసుల సెక్షన్లను ప్రైవేటీకరిస్తుందన్నారు. ఎన్నికల హామీ మహలక్ష్మీ ఉచిత బస్ వసతి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కార్మికుల పట్ల సానూకలత చూపకపోగా, మహాలక్ష్మీ స్కీమ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో నేడు కార్మికుల జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన నిధులు 4,400కోట్లు దొడ్డిదారిన ఇతర పనులకు వాడుకుందని, దీంతో సీసీఎస్, ఎస్సార్బీఎస్, ఎస్బీటీ, పీఎఫ్ సంస్థలు నామమాత్రంగా మారిపోయాయని ఆరోపించారు. ఆర్టీసీకి చెందిన విలీన ప్రకియ పూర్తి, యూనియన్ల పునరుద్ధరణ, 15వేల ఖాళీల భర్డీ, కొత్త బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, కార్మికుల బకాయిల చెల్లింపు వంటి సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే త్వరలోనే ఆర్టీసీ కార్మికుల్లో అశాంతి ఏర్పడవచ్చని, అందుకే మీరు ప్రభుత్వానికి మాకు మధ్యవర్తిత్వం నెరపి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కమిటీ కోరింది.