తెలంగాణలోని ఎమ్మెల్యే, ఎంపీలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రత పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4 గా పెంచుతూ అన్ని జిల్లాల అధికారులకు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
నిన్న దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి కడుపులోకి మూడు ఇంచుల లోతులో కత్తి దిగిందని యశోద వైద్యులు తెలిపారు. దాదాపు 4 గంటల పాటు సర్జరీ చేశారు. ప్రభాకర్రెడ్డి కడుపులో చిన్న పేగుకు 4 చోట్ల గాయాలయ్యాయని, దీంతో కడుపులో రక్తం పేరుకుపోయిందని వివరించారు.
అందువల్ల 15 సెంటమీటర్ల మేర కడుపును కోతపెట్టి పేరుకుపోయిన రక్తాన్ని శుభ్రం చేశామని, చిన్నపేగును 10 సెంటీమీటర్ల మేర కట్ చేశామని వెల్లడించారు. సీటీ స్కాన్, ఈసీజీ, అన్ని రకాల రక్తపరీక్షలు, ప్రి-అనస్థీషియా పరీక్షలు వంటి పరీక్షలన్నీ చేశాకే సర్జరీ చేశామని తెలిపారు. ఆయనను గ్రీన్ చానల్తో హైదరాబాద్కు తరలించి ఉండకపోతే మరింత ఇబ్బందయ్యేదని చెప్పారు.