• Telugu News
  • /Telangana

Minister Seethakka | మేడారం అభివృద్ధిని తట్టుకోలేక అబద్ద ప్రచారం : మంత్రి సీతక్క 

మేడారంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ప్రత్యర్థులు తమపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Nov 13, 2025, 7:08 pm IST
Read Time: 7 mins
Minister Seethakka | మేడారం అభివృద్ధిని తట్టుకోలేక అబద్ద ప్రచారం : మంత్రి సీతక్క 

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Minister Seethakka |అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని కనీసం పట్టించుకోకుండా కాంగ్రెస్ హయాంలో ములుగు నియోజకవర్గంలో సాగుతున్న అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేక కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు తప్ప, నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజా సమస్యలను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. చివరికి ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం శాశ్వత అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి కోట్లాది నిధులతో పనులు చేపడుతుంటే సహించలేక పోతున్నారని విమర్శించారు. మేడారం అభివృద్ధిపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక దేవతల అంశాలను స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ములుగులో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రిగా తాను నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని కొనసాగిస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలను, వారి పార్టీ శ్రేణులను సైతం తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. ఎవరేమనుకున్నా ములుగు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ములుగును అన్ని రంగాల్లో ముందంజలోకి తెచ్చి, పరుగులు పెట్టించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. తప్పుడు ప్రచారం, ఆరోపణలతో తాత్కాలికంగా మభ్యపెడుతున్న వారికి నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేసే వారు తమ బుద్ది మార్చుకోవాలని లేకుంటే కాంగ్రెస్ శ్రేణులు సైతం గట్టి సమాధానం చెబుతారని సీతక్క అన్నారు.

Vidarbha Crisis | కాస్త నాకు ‘వైఫ్‌’ను వెతికి పెట్టండి.. శరద్‌పవార్‌కు విదర్భ యువ రైతు మొర!

ములుగులో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. నియోజకవర్గంలోని వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప సరస్సులో రూ.13 కోట్ల నిధులతో ద్వీపం అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 50 లక్షల నిధుల తో చేపట్టిన సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణము పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 61 లక్షల నిధులతో చేపట్టిన బండారుపల్లి జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులను, రూ. కోటి 50 లక్షల నిధులతో చేపట్టిన ముస్లీం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను, రూ. 15 లక్షల నిధులతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనం,రూ. 10 లక్షల నిధులతో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనం నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ములుగు ప్రవేశ ద్వారంగా మారిన గట్టమ్మ దేవాలయం వద్ద రూ. 3 కోట్ల 62 లక్షల నిధులతో 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కొన్ని పనులు, జిల్లాకేంద్రంలో అవసరమైన వసతుల కల్పనలో భాగంగా మరి కొన్ని పనులు, జాతర నేపథ్యంలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఇంకొన్ని పనులు కొనసాగుతున్నాయి. మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు రోజూ రాకపోకలు సాగించే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కొన్ని పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంమైన ములుగును సుందరంగా తీర్చదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవిందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also |

Talking Crow Viral Video : కాకి మాట్లాడుతుంది…రష్యా భాషలో..వైరల్ వీడియో
Sania Mirza : ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం
No Traffic Signals | మీకు తెలుసా..? ఈ ప‌ట్ట‌ణంలో నో ట్రాఫిక్ సిగ్న‌ల్స్‌..! అది కూడా మ‌న దేశంలోనే..!!