కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి.. ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు: ఫామ్‌హౌస్‌ మీటింగ్‌లో కేసీఆర్‌

పదేండ్ల బీఆరెస్‌ పాలనలో తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని, ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు

  • Publish Date - June 27, 2024 / 07:38 PM IST

కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి
ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు
కాంగ్రెస్‌ హామీలను నమ్మి జనం మోసపోయారు
బీఆరెస్‌ ప్రస్థానం ఆగేది కాదు
కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదు
బీఆర్ఎస్‌కు బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారు
వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందాం
ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో తనను కలిసినవారితో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌:పదేండ్ల బీఆరెస్‌ పాలనలో తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని, ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘కొన్ని కొన్నిసార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళితే అర్థమౌతుంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. ‘పాలిచ్చే బర్రెను వొదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది’ అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారు’ అని కేసీఆర్ అన్నారు. ఉద్యమంతో పాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సివున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌స్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమైతున్న తెలంగాణ ను అక్కున చేర్చుకుని మల్లా గాడిలో పెట్టేదాకా, బీఆరెస్‌ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తనను కలిసేందుకు గురువారం ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది.

తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు..” అని తేల్చి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తున్నదని విశ్లేషించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందని అన్నారు. నాయకులు పార్టీ లోకి వచ్చి పోతుంటారని, కొంతమంది నాయకులు బీఆరెస్‌ను వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్‌ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని కేసీఆర్ తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్‌ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి, తిరిగి బీఆర్ఎస్‌ను ఆదరిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓపికతో ప్రజాసమస్యలపైన దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని కార్యకర్తలకు అధినేత పిలునిచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కేసీఆర్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు, తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Latest News