విధాత : సోషల్ మీడియా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడిన కేసులలో భారతీయ నేర సంహిత సెక్షన్-111 ప్రకారం సస్పెక్ట్ షీట్/రౌడీ షీట్, హిస్టరీ షీట్స్ తెరువాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్ విభాగం నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.
భవిష్యత్తులో వారు మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడకుండా నిందితుల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ఇంకా శిక్ష పడకపోయినా సస్పెక్ట్ కేటగిరిలో నమోదైన నిందితుల కదలికలపై క్లోజ్ సర్వే లైన్స్ తప్పనిసరి చేయాలని.. నిర్దిష్ట గడువు లోపల రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల అవాంఛనీయ కార్యకలాపాలను అడ్డుకట్ట పడుతుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు ఉంటాయని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు.