సోషల్ మీడియాలో మైనర్ బాధితురాలి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే జైలు.. సైబరాబాద్ పోలీసుల కఠిన హెచ్చరిక
పోక్సో కేసులో మైనర్ బాధితురాలి ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేసిన అకౌంట్లపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కంటెంట్ షేర్, రీషేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోక్సో కేసులో మైనర్ బాధితురాలి వివరాలు షేర్ చేస్తే కఠిన చర్యలు: సోషల్ మీడియాపై సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక
POCSO Case: Cyberabad Police Register FIR Against Social Media Accounts
- మైనర్ బాధితురాలి ఫొటోలు షేర్ చేస్తే జైలు.. సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక
- పోక్సో కేసులో సోషల్ మీడియాపై పోలీసుల ఉక్కుపాదం
- ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లపై కేసులు నమోదు
- మైనర్ వివరాలు బయటపెడితే కఠిన చర్యలు
- వైరల్ వీడియోలు షేర్ చేసినా నేరమే: పోలీసులు
విధాత | మే 16, 2026:
హైదరాబాద్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు, స్క్రీన్షాట్లు, వ్యక్తిగత వివరాలపై ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో కఠిన చర్యలు ప్రారంభించారు. పోక్సో కేసులో ఉన్న బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన పలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ‘వైరల్’ పేరిట బాధితురాలి గౌరవం, గోప్యతను భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. మైనర్ బాధితురాలి గుర్తింపును బయటపెట్టడం భారత చట్టాల ప్రకారం తీవ్రమైన నేరమని హెచ్చరించారు.
ALSOE READ: లక్షల సీసీ కెమెరాలు ఉన్నా.. భగీరథ్ కదలికలు పసిగట్టలేకపోతున్నారా?
బాల సంక్షేమ సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు
మెదక్-మల్కాజిగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 706/2026గా నమోదు చేసిన ఈ కేసులో పలు న్యాయపరమైన సెక్షన్లు చేర్చారు.
పోలీసుల ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం చేసిన అంశాల్లో:
- మైనర్ బాధితురాలి ఫొటోలు, కేసుకు సంబంధించిన వీడియోలు, బాలిక, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలుఎఫ్ఐఆర్కు సంబంధించిన గుర్తింపు సమాచారం, ఎడిట్ చేసిన క్లిప్లు, వైరల్ స్క్రీన్షాట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఈ కంటెంట్ను షేర్ చేసిన పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ను పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు.
వైరల్ చేసిన సోషల్మీడియా అకౌంట్ల గుర్తింపు
సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే పలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ల వెబ్ అడ్రస్లు, డిజిటల్ వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు సమాచారం పంపినట్లు తెలిపారు.
PRESS RELEASE pic.twitter.com/eGpK65ovn3
— Cyberabad Police (@cyberabadpolice) May 15, 2026
సైబర్ క్రైమ్ అధికారులు ఇప్పటికే ఆయా సోషల్మీడియా అకౌంట్ హ్యాండ్లర్ల గుర్తించడం, ఐపీ అడ్రస్ ట్రాకింగ్, డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, మొదటగా ఎవరు పోస్ట్ చేసారు, తిరిగి షేర్ చేసిన వారందరి వివరాలను విశ్లేషించడం వంటి ప్రక్రియలను వేగవంతం చేసినట్లు సమాచారం.
వైరల్ కంటెంట్ను కేవలం “ఫార్వర్డ్ మాత్రమే చేశాం” అనే సాకు కూడా చట్టపరంగా రక్షణ కల్పించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏ చట్టాల కింద కేసులు?
పోలీసులు నమోదు చేసిన కేసులో కీలకమైన చట్టాలను ప్రయోగించారు.
సెక్షన్ 23 – పోక్సో యాక్ట్
పోక్సో కేసులో ఉన్న బాధితురాలి గుర్తింపును ఏ రూపంలోనైనా బయటపెట్టడం నిషేధం. ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ కంటెంట్ ద్వారా జరిగినా ఇది వర్తిస్తుంది.
సెక్షన్ 74 – జువైనల్ జస్టిస్ యాక్ట్
పిల్లల గోప్యత, గౌరవాన్ని రక్షించే నిబంధన ఇది. బాలల గుర్తింపును బహిర్గతం చేస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారం ఈ చట్టం ద్వారా సంక్రమిస్తుంది.
సెక్షన్ 72(1) – భారతీయ న్యాయ సంహిత (BNS)
వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలపై ఈ సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేయవచ్చు.
సోషల్ మీడియాలో నిరంతర పర్యవేక్షణ ముమ్మరం
ఈ కేసుతో సంబంధం ఉన్న వైరల్ కంటెంట్ను పోలీసులు ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రత్యేకంగా ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్స్టాగ్రామ్, యూట్యూబ్లలో షేర్ అవుతున్న పోస్టులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ ఛానెల్స్, ట్రోల్ అకౌంట్లు కూడా పోలీసుల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది.
“వైరల్” పేరుతో చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మైనర్ బాధితురాలి గుర్తింపును బయటపెట్టడం వల్ల ఆమెకు తీవ్రమైన మానసిక వేదన కలుగుతుందనీ, ఇది కేవలం చట్టపరంగా నేరం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యత కూడా అని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రత్యేకంగా, బాలిక లేదా పోక్సో కేసులో ఉన్న బాధితురాలి వ్యక్తిగత వివరాలను బయటపెట్టడం తీవ్రమైన నేరమంటూ, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
మీడియా, సోషల్ మీడియాకు కీలక హెచ్చరిక
ఇటీవలి కాలంలో వైరల్ కంటెంట్ కోసం యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎడిట్ చేసిన వీడియోలు, స్క్రీన్షాట్లు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అయితే మైనర్ బాధితుల కేసుల్లో అలాంటి ప్రచారం తీవ్రమైన చట్టపరమైన సమస్యలకు దారితీయొచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ ప్రింట్, డిజిటల్ మీడియా సంస్థలు కూడా ఇప్పుడు పేర్లు ప్రస్తావించకుండా, ముఖాలు చూపకుండా, కుటుంబ వివరాలు గోప్యంగా ఉంచుతూ, పరోక్ష గుర్తింపులు కూడా లేకుండా వార్తలు ప్రచురించే లేదా ప్రదర్శించే విధానాన్ని పాటిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram