మాజీ సీఎం కేసీఆర్ ధనదాహంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి మాత్రమే కుంగలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లకు పైగా అప్పులు
విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ ధనదాహంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి మాత్రమే కుంగలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్ధికంగా కుప్పకూల్చారని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సోమాజిగూడలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడి జరిగిందని కోదండరాం ఆరోపించారు. మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని, నీళ్లు నింపాలంటూ బీఆరెస్ నేతలు సమస్యను తక్కువ చేసి చూపుతు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంజనిరింగ్ వ్యవస్థ నిర్వర్యం జరిగిందని, దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం పై బీఆరెస్ అబద్దాలు చెబుతోందని, కాగ్ చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కోదండరామ్ సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఐక్యరాజ్య సమితికి పని చేసిన నిపుణులు హన్మంతరావు సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టవద్దన్నప్పటికి కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. కాగ్ నివేదికలో ఉన్న అంశాలు మనమే స్వంతంగా రాసినట్టుందని.. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు ఆర్ధిక అంశాల గురించి అంచనా వేయకుండా నిర్మించారని ఆరోపించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను కొందరికి గుండు గుత్తగా కేటాయించారని కాగ్ వెల్లడించిందన్నారు. కాళేశ్వరం ద్వారా రైతులకు సాగు నీరు అందించడం చాలా కష్టమని, ఒక ఎకరాకు నీరందించడానికి 46 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కోదండరామ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 శాతం విద్యుత్తు కాళేశ్వరం నిర్వహణకు అవసరం ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో భూకంపలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కేవలం కొండ పోచ్చమ్మ కాలువ నిర్మాణానికి రూ. 70 కోట్లు కేటాయించారని, గతంలో కడెం ప్రాజెక్ట్ మట్టి మాత్రమే కొట్టుకుపోయిందని.. తర్వాత జరిగిన నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి డిజైనర్, ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్పై కేసు పెట్టి ప్రాసిక్యూషన్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంజనీర్ కానటువంటి కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండ వంటిదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఇంజనీర్గా మారి తన తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టును బలిచేయడంతో పాటు రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపారని విమర్శించారు. గాడిద పని గాడిద, గుర్రం పని గుర్రం చేసి ఉంటే కాళేశ్వరంకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఈ సదస్సులో సీపీఎం నేత , మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సహా పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.