ఏప్రిల్ 24న నేను మిమ్మల్ని హెచ్చరించాను. మీరు మీ విధులను సక్రమంగా నిర్వహించకుంటే.. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తాను
– ప్రధాని మోదీపై 27 ఫిర్యాదులు
– ఒక్కదానిపైనా చర్యల్లేవు!
– విపక్షనేతల కేసులలో వెంటనే
– జై బజరంగ్ బలీ అంటూ ఓటేయాలని మోదీ చెబితే చర్యల్లేవు
– ఉద్దవ్ పార్టీ గేయంలో జై భవానీ, హిందూ పదాలపై అభ్యంతరం!
– ముస్లింలను చీల్చే ప్రయత్నం జరుగుతున్నదంటే ఈసీ ఆగ్రహం
– చొరబాటుదారులని వ్యాఖ్యానిస్తే సుతిమెత్తగా నోటీసులు జారీ
‘ఏప్రిల్ 24న నేను మిమ్మల్ని హెచ్చరించాను. మీరు మీ విధులను సక్రమంగా నిర్వహించకుంటే.. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తాను’
– బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ 2014 మే 8న చెప్పిన మాట! మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఈసీ నిష్పాక్షికంగా ఉన్నదా? పక్షపాతంతో వ్యవహరిస్తున్నదా?
రాముడికి గుడి కట్టాం.. ఓటేయండి.. అంటూ మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లడుగుతారు! జై బజరంగ్బలి అని నినదించి ఈవీఎంపై బటన్ నొక్కాలని పిలుపునిస్తారు! ముస్లింలనుద్దేశించి చొరబాటుదారులంటూ ఒక వర్గంపై మరో వర్గంలో విద్వేషం పెంచేలా వ్యాఖ్యలు చేస్తుంటారు! సాయుధ దళాల అమరత్వాన్ని సైతం ఓటు రాజకీయలకు వాడుకుంటారు! ప్రతిపక్ష పార్టీలపై అర్బన్ నక్సలైట్లనే ముద్ర వేస్తారు! కానీ.. వారిపై ఎలాంటి చర్యలూ ఎన్నికల సంఘం నుంచి ఉండవు! ఫిర్యాదులు చేసినా.. పట్టించుకునే పరిస్థితి లేదు! ఒకవేళ పట్టించుకున్నా.. పేరు ప్రస్తావించి మరీ నోటీసులు పంపే సాహసమూ ఉండదు! అదే ప్రతిపక్ష నేతలపై బీజేపీ ఫిర్యాదు చేస్తే.. మరో పనేదీ లేదన్నట్టుగా ఆగమేఘాలపై స్పందిస్తుంది! మోదీ పదేళ్ల పాలనా కాలంలో తీవ్ర విమర్శలకు గురవుతున్న ఎన్నికల సంఘం దుస్థితి ఇది! ఎన్నికల సంఘం తనను తాను నియంత్రించుకుంటున్నదా? ప్రభుత్వంలోని శక్తులు కట్టడి చేస్తున్నాయా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
పదేళ్లలో 27 ఫిర్యాదులు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాని నరేంద్రమోదీపై 2019 నుంచి ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీలు 27 ఫిర్యాదులు చేశాయి. కానీ.. వీటిలో ఏ ఒక్కదానిపైనా ఈసీ నిర్దిష్ట చర్యలు తీసుకోనేలేదు. విద్వేష ప్రచారం, ఓట్ల కోసం సాయుధ దళాలను వాడుకోవడం, మతం పేరుతో ఓట్లు అభ్యర్థించడం, ప్రధాన మంత్రి ఎన్నికల ర్యాలీలకు ప్రసంగాల తయారీకి ప్రభుత్వ శాఖలను ఉపయోగించడం తదితర అంశాల్లో మోదీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్ష నాయకులపై వచ్చే ఫిర్యాదులపై హుటాహుటిన చర్యలకు దిగే ఎన్నికల సంఘం.. ఈ ఫిర్యాదులపై మాత్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటం దాని స్వతంత్ర ప్రతిపత్తిపై వచ్చిన విమర్శలకు బలం చేకూర్చుతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీపై తాజాగా అందిన ఫిర్యాదులపై వినూత్నంగా స్పందించిన ఈసీ.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు 2024, ఏప్రిల్ 25న ఒక నోటీసు జారీ చేస్తూ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ఉపన్యాసాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ పొడి పొడి మాటలతో సరిపెట్టడం విశేషం. కనీసం అందులో ప్రధాని పేరు ప్రస్తావించలేదు. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపద మొత్తాన్నీ చొరబాటుదారులు, అధిక సంతానం ఉన్నవారికి ఇచ్చేస్తుందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఫిర్యాదుకు ఇదీ ఎన్నికల సంఘం ప్రతిస్పందన! ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే తొలి హక్కు ఉన్నదని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చెప్పారు. అంటే దానర్థం.. ఆ సంపదను అధిక సంతానం ఉన్న చొరబాటుదారులకు పంచిపెడతారనే. దీన్ని మీరు ఒప్పుకొంటారా?’ అని ప్రధాని మోదీ రాజస్థాన్లోని బన్స్వారాలో ఏప్రిల్ 21, 2024న చేసిన ప్రసంగంలో అన్నారు. ‘మన తల్లులు, చెల్లెళ్ల బంగారాన్ని లెక్కిస్తామని, సమాచారం తెలుసుకుంటామని, వాటిని అందరికీ పంచేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెబుతున్నది. ఈ అర్బన్ నక్సలైట్ ఆలోచనలు ఉన్నవాళ్లు.. ఆఖరుకు మీ మంగళసూత్రాలు కూడా వదలరు. అని ఆయన వ్యాఖ్యానించారు.
నియమావళి ఏం చెబుతున్నది?
వాస్తవానికి ‘ఏ పార్టీ లేదా అభ్యర్థి భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు లేదా భాషల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా మాట్లాడకూడదని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ ఐ(1) పేర్కొంటున్నది. ప్రధాని వ్యాఖ్యలపై ఆయన పేరు ప్రస్తావించకుండా జారీ చేసిన నోటీసులకు ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ బీజేపీని ఆదేశించింది. ఒక వెబ్సైట్.. ప్రధానిపై 2019 నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించింది. అందులో 12 ఫిర్యాదులు మతపరమైన వ్యాఖ్యలకు ఉద్దేశించినవే ఉన్నాయి. మరో ఎనిమిది ఫిర్యాదులు సాయుధ దళాలను ఓట్ల కోసం వాడుకోవడానికి సంబంధించినవి. రాజకీయ ప్రకటనల్లో ప్రభుత్వ పథకాలను ఉపయోగించినదానికి సంబంధించిది ఒకటి ఉన్నది. మత ప్రాతిపదికన ఓట్లు అడగడం, ఎన్నికల ప్రసంగాలకు ప్రభుత్వ శాఖలను ఉపయోగించుకోవడం, ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని హెలికాప్టర్లో ఉంచిన అనుమానాస్పద బ్లాక్బాక్సు, బాలలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం, పోలింగ్కు ముందు ప్రచారం గడువు సమయం ముగిసిన తర్వాత కూడా ప్రచారం చేయడం వంటివి ఉన్నాయి. తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.
ప్రవర్తనా నియమావళి ఉన్నా.. జాతినుద్దేశించి ప్రసంగం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2019 మార్చి 27న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అప్పటి ఎన్నికల కమిషనర్కు ఒక లేఖ రాశారు. ఆ ఉపన్యాసంలో మోదీ డీఆర్డీవో శాస్త్రవేత్తలు విజయవంతంగా యాంటిశాటిలైట్ మిస్సైల్ను పరీక్షించిన అంశాన్ని ప్రకటించారు. వాస్తవానికి అటువంటి అంశాలను డీఆర్డీవో వంటి సంబంధిత శాస్త్రీయ సంస్థలు మాత్రమే దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంటుందని ఏచూరి తన ఫిర్యాదులో తెలిపారు. కానీ.. ఈ అంశాన్ని అవకాశంగా చేసుకుని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న మోదీ ఈ ప్రకటనను చేయడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రకటనలు చేస్తే కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కనుక సదరు కేసు కోడ్ ఉల్లంఘన పరిధిలోకి రాదని తేల్చేసింది. దీనికి స్పందించిన ఏచూరి.. దీనిని అధికార మీడియా దుర్వినియోగం అనే సంకుచిత అభివర్ణనతో పక్కకు పెట్టేయడం కాదని, వాస్తవానికి ప్రధాని అభ్యర్థిగా ఉన్న నేత శాస్త్రవేత్తలు సాధించిన ఘనతను ప్రధాని కార్యాలయాన్ని వాడుకుని వాడుకోవడం అతిపెద్ద అంశమని పేర్కొన్నారు. ఇదే మోదీ ప్రసంగం అనంతరం భూమి, గాలికి మాత్రమే కాదు.. అంతరిక్షానికి కూడా తాను కాపలాదారు అని పేర్కొన్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. అయితే.. దీనికి ఎన్నికల సంఘం నుంచి ఉలుకుపలుకు లేదు.
ఏకపక్ష నియామకాలే
గత ఏడాది డిసెంబర్లో ఎన్నికల ప్రధానాధికారి, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దానిలోని సెక్షన్ 7 ప్రకారం ప్రధాని చైర్మన్గా, ప్రధాని నామినేట్ చేసిన మంత్రితోపాటు ప్రతిపక్ష నేతతో కూడిన ఎంపిక కమిటీ సిఫార్సు చేసిన వ్యక్తులను రాష్ట్రపతి నియమిస్తారు. వాస్తవానికి అంతకు ముందు సుప్రీంకోర్టు ప్రధాని, మంత్రి, ప్రతిపక్ష నేతతోపాటు సీజేఐ కూడా ఉన్న నలుగురు సభ్యుల కమిటీ ఎంపిక చేయాలని పేర్కొన్న సంగతి విదితమే. అయినా.. ముగ్గురు సభ్యులతోనే కమిటీని నియమించడంతోనే ఎంపిక తీరు ఎలా ఉంటుందన్నది అర్థమైపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతిపక్ష నేతలపై హుటాహుటిన చర్యలు
తమ పార్టీ నూతన గేయంలో జై భవానీ, హిందూ పదాలను తొలగించాలంటూ తమకు ఎన్నికల సంఘం నుంచి నోటీసు అందిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రె ఏప్రిల్ 21న చెప్పారు. ఎన్నికల సంఘం తమపై చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని, అయితే.. జై బజరంగ్ బలీ అని నినదించి ఈవీఎం బటన్ నొక్కాలని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చినప్పుడు, అయోధ్యలో రాముడి ఉచిత దర్శనం కావాలంటే బీజేపీకి ఓటేయాలని అమిత్షా చెప్పినప్పుడు ఈసీ ఏం చేసిందో చెప్పాలని అన్నారు. హనుమంతుడి పేరు వాడి ఎన్నికల్లో ప్రచారం చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా 2023, మే 4వ తేదీన ఈసీకి ఫిర్యాదు చేసింది. దానిపైనా ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మోదీని ఉద్దేశించి పనౌటీ, జేబుదొంగ, సంపన్నులకే పన్ను మినహాయింపులు తదితర విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి 2023 నవంబర్లో ఈసీ షోకాజ్ నోటీసు పంపింది. ‘రాజకీయ ప్రత్యర్థులపై ధృవీకరించుకోని విమర్శలు చేయడాన్ని ఎన్నికల కోడ్ నిషేధిస్తుంది’ అని స్పష్టం చేశారు. కానీ.. మీ సొత్తును ఎక్స్రే తీయడానికి కాంగ్రెస్ పార్టీ విదేశాల నుంచి మిషన్ తెప్పించిందని, మీ సొత్తును ప్రజలకు పంచేస్తుందని ఆరోపిస్తే మాత్రం.. ఈసీకి ఈ నిబంధన గుర్తు రాలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అదానీ, మోదీ ఫొటో పెట్టినా ఆగ్రహం!
ప్రధానికి సన్నిహితుడని చెప్పే పారిశ్రామికవేత్త గౌతం అదానీతో మోదీ ఉన్న ఫొటోను ఆమ్ ఆద్మీ పార్టీ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే అది ప్రధానికి అవమానకరమంటూ ఆ పార్టీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఒవైసీ వంటి నేతలను తీసుకువచ్చి మిమ్మల్ని చీల్చాలని వాళ్లు చూస్తున్నారని ముస్లింలనుద్దేశించి 2019లో కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధు హెచ్చరిక చేయడంపై ఆగ్రహించిన ఈసీ.. ఆయనను 72 గంటలపాటు ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసింది.