తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్ల సీఎం రేవంత్రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావులు పరస్పర భిన్నంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి
విధాత : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్ల సీఎం రేవంత్రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావులు పరస్పర భిన్నంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టోడు కాబట్టే నిధులు సర్దుతున్నారని ప్రశంసించారు.
అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా అగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 9వ తేదీలోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. బకాయిలు విడుదల చేసిన వెంటనే అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాస్తవా? కేసీఆర్ అని ఛాలెంజ్ చేశారు. భట్టిపై సీఎం రేవంత్ కురిపించిన ప్రశంసలకు భిన్నంగా సీనియర్ నేత వి. హన్మంతరావు స్పందించారు. బీజేపీ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లనుపక్కన పెట్టాలని చూస్తోందన్నారు. దళితుల గురించి మొదట్లో భట్టి మాట్లాడేవారని… డిప్యూటీ సీఎం అయ్యాక భట్టి సైలెంట్ అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. విహెచ్ ఖమ్మం టికెట్ ఆశించిన క్రమంలో భట్టి మద్దతు పలకకపోవడంతో ఆయనపై అసంతృప్తితో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.