కమలదళం దూకుడు.. ప్రాంతీయ పార్టీల కట్టడి
కేంద్ర ప్రభుత్వంపై పోరుకు విపక్షాలు ఏకమతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయపార్టీల అధినేతలైన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్, శరద్ పవార్, నితీశ్కుమార్, స్టాలిన్ లాంటి వాళ్లు ఇప్పటికే ఈ పోరును ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపడానికి రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో మోదీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తుతున్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే ఈ అడుగులని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాలతో విధ్వంసం సృష్టిస్తున్నాయని […]

కేంద్ర ప్రభుత్వంపై పోరుకు విపక్షాలు ఏకమతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయపార్టీల అధినేతలైన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్, శరద్ పవార్, నితీశ్కుమార్, స్టాలిన్ లాంటి వాళ్లు ఇప్పటికే ఈ పోరును ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపడానికి రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.
ఈ యాత్రలో మోదీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తుతున్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే ఈ అడుగులని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాలతో విధ్వంసం సృష్టిస్తున్నాయని వాటి నుంచి దేశాన్ని రక్షించడమే తమ లక్ష్యమన్నారు.
బీహార్లో బీజేపీకి బైబై చెప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్కుమార్ మిషన్-2024 లక్ష్యంగా సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిని కలిసి చర్చించారు.
మంగళవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాను వారి కార్యాలయాల్లో కలిశారు. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోనూ భేటీ అయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నితీశ్మాట్లాడుతూ…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేది తర్వాత నిర్ణయించుకుంటామని, బీజేపీని ఎదుర్కొనేలా విపక్ష పార్టలన్నింటని ఐక్యం చేయడమే తమ లక్ష్యమన్నారు. తమది థర్డ్ ఫ్రంట్ కాదు, మెయిన్ ఫ్రంట్ అవుతుందన్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలన్నీ కలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోవన్నారు. బీజేపీ స్థానాల సంఖ్య 50కి పడిపోతుందన్నారు.
అలాగే ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీకి లభించిన ఘన విజయంతో ఆయన తన పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు.
పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. తాజాగా తృణమూల్ సీనియర్ నాయకుడు అనుబ్రాత మండల్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బీజేపీపై దూకుడు ప్రదర్శించిన మమతా బెనర్జీ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో బహిరంగ సభల్లోనూ, ప్రెస్ మీట్లలోనూ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్లాలని, కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే దేశం బాగుపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
2024లో ఢిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని చెప్పారు. నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుందని, మన ప్రభుత్వం వచ్చాక దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. మన ప్రభుత్వం వచ్చేలా తెలంగాణ నుంచే దేశం కోసం రాజకీయ పోరాటం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.
ప్రాంతీయ పార్టీల నేతలు బలంగా ఉన్న రాష్ట్రాల లోక్సభ స్థానాలపై బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునేలోగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం కార్యాచరణను అమలు చేస్తున్నది. అలాగే మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సొంతంగానే సత్తా చాటలని చూస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరికి వారు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల హడావుడి ఇప్పుడే మొదలైంది. రానున్న రోజుల్లో ఈ రాజకీయం మరింత వేడక్కనున్నది.