Viral Video | రైలు బోగీలో ఎయిర్కూలర్.. వీడి స్టైలే సపరేటు!
రైల్లో ప్రయాణించేటప్పుడు సౌకర్యం కోసం కొందరు దిండ్లు దుప్పట్లు తెచ్చుకుంటారు. చలిపుడుతుంటే రగ్గులు తెచ్చుకుంటారు. మరి ఉక్కబోస్తే? ఒక మహామేధావి అయిన ప్రయాణికుడు ఏకంగా ఎయిర్కూలర్ను తెచ్చుకున్నాడు

Viral Video | రైల్లో ప్రయాణించేటప్పుడు సౌకర్యం కోసం కొందరు దిండ్లు దుప్పట్లు తెచ్చుకుంటారు. చలిపుడుతుంటే రగ్గులు తెచ్చుకుంటారు. మరి ఉక్కబోస్తే? ఒక మహామేధావి అయిన ప్రయాణికుడు ఏకంగా ఎయిర్కూలర్ను తెచ్చుకున్నాడు. తన సీటుపైన మూడు ఫ్యాన్లు తిరుగుతున్నా.. అవి సరిపోవనుకున్నాడేమో.. తన ఎయిర్కూలర్ను స్విచ్బోర్డులో కనెక్ట్ చేసి.. ఆ చల్లగాలికి హాయిగా నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్గా మారింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.
నిజానికి కూలర్ వంటి అధిక వోల్టేజ్ ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను రైలు బోగీల్లో ఉండే సాకెట్లతో కనెక్ట్ చేయి పనిచేయించడం సాధ్యం కాదనే అభిప్రాయాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి.. ఇది కేవలం రీల్స్ కోసం తీసినది అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ వీడియోను అదే బోగీలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు చిత్రీకరించి, ఇంటర్నెట్లో ఉంచగా.. అది బాగా వైరల్ అవుతున్నది. ఇప్పటి వరకూ దీనికి రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
నిజానికి రైలు బోగీల్లోని ప్లగ్ సాకెట్లలో సెల్ఫోన్లు, ల్యాప్టాప్, పవర్ బ్యాంక్ వంటి తక్కువ విద్యుత్తును తీసుకునే పరికరాలను మాత్రమే చార్జింగ్ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. కూలర్ వంటి అధిక విద్యుత్తును వినియోగించే వాటిని కనెక్ట్ చేసిన పక్షంలో జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారో చూడండి.. ఇది టీటీ చూసి ఉంటే.. వెంటనే జరిమానా వేసి ఉండేవాడు’ అని ఒకరు వ్యాఖ్యానించారు. కొత్త కూలర్ కొనుక్కొని వెళుతూ.. దారిలోనే దాన్ని వాడటం మొదలెట్టేశాడు.. అని మరొకరు కామెంట్ చేశారు. ‘ఇప్పుడు బాగానే ఉంటుంది.. ఫైన్ పడితే అప్పుడు తెలుస్తుంది’ అని మరొకరు స్పందించారు. 230 వోల్ట్లతో నడిచే పరికరాలు రైల్వే సాకెట్లో పనిచేస్తాయా? అన్న సందేహం వ్యక్తం చేసిన ఒక యూజర్.. ఇది అసలైనది కాదేమోనని, రీల్స్ కోసం తీసిందేమోనని అనుమానం వ్యక్తం చేశాడు.