AP Metro Rail Tenders : విశాఖ, విజయవాడ మెట్రో టెండర్ల గడువు పెంపు
విశాఖ, విజయవాడ మెట్రో టెండర్ల గడువులు పొడిగించబడ్డాయి; జాయింట్ వెంచర్స్కి అవకాశంతో నిర్మాణ ఖర్చు తగ్గింపు లక్ష్యం.

అమరావతి : ఏపీలోని విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్ల గడువును పెంచినట్లుగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖ మెట్రో టెండర్లకు వచ్చే నెల 10వరకు గడువు పొడిగించగా..విజయవాడ మెట్రో టెండర్లకు వచ్చే నెల 14 వరకు గడువు పెంచినట్లుగా తెలిపారు. టెండర్లలో జాయింట్ వెంచర్స్కు అవకాశం ఇచ్చాం అని..3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకోవచ్చు అని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ సంస్థల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దీనివల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయని, రెండు ప్రాజెక్టులను తక్కువ సమయంలో పూర్తి చేసి..నిర్మాణ వ్యయం తగ్గించాలనేదే మా ఉద్దేశం అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఫేజ్-1లో విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర ఉన్న 40 శాతం సివిల్ పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు ప్రాజెక్ట్లను రికార్డు టైంలో 2028 నాటికి పూర్తి చేయడంతో పాటు నిర్మాణ వ్యయం పెరిగిపోకూడదనే ఉద్దేశంతో పనులను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభజించడం లేదని చెప్పుకొచ్చారు.