రైతు, దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి

రైతు, దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: దళితులు, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు, దళిత బంధు పథకాలపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం గుత్తా మీడియాతో మాట్లాడారు.


రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయానికి సాయంగా పది విడతలుగా రబీ, ఖరీఫ్ సీజన్ లకు రైతు బంధు పథకం అమలు చేస్తుంటే, వారి అభివృద్ధిని చూసి ఓర్వలేని నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాక్రే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం అంటే ఏంటో, రైతుల కష్టాలు ఏమిటో అస్సలు తెలియవన్నారు.


దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని దళిత బంధు పథకాన్ని కూడా నిలుపుదల చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు అన్నారు. రైతులకు ఇచ్చే 24 గంటల కరెంట్, మిషన్ భగీరథను కూడా ఆపేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని చెప్పారు. కాంగ్రెస్ బూటకపు హామీలు నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేస్తే రాష్ట్రం అధోగతిపాలవుతుందన్నారు.