ఆకస్మిక తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యేకు షాక్ !

తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యేకే షాక్! కడప పాఠశాలలో అద్వాన్నంగా మధ్యాహ్న భోజనం.. అపరిశుభ్రంగా బాత్‌రూమ్స్. అధికారులపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి సీరియస్.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Apr 06, 2026, 3:00 pm IST
Read Time: 4 mins
ఆకస్మిక తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యేకు షాక్ !

అమరావతి : డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరుతెన్నులపై ఆకస్మిక తనిఖీతో షాక్ ఇవ్వాలనుకుని వెళ్లిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికే అనూహ్య షాక్ తగిలింది. కడప నగరం ముతరాసుపల్లి జడ్పీ స్కూల్ ను ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న పాఠశాలలోని బాత్ రూమ్స్ ను చూసి ముక్కుమూసుకొని బయటకొచ్చారు. మండుటెండలో మట్టిలో పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసి అవాక్కయ్యారు.

భోజనం ఎలా పెడుతున్నారన్న ప్రశ్నకు ప్రతి రోజూ భోజనం బాగా ఉండటం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే మాధవికి వివరించారు. 70 మందికి భోజనం పెట్టాల్సి ఉండగా…అక్కడ సిద్దం చేసిన వంటకాలు సగం మందికి కూడా సరిపోయేలా లేకపోవడంతో ఎమ్మెల్యే విస్మయానికి గురయ్యారు. చారు నీళ్ల మాదిరిగా సాంబరు కనిపించగా… ఈ రోజు మెను ప్రకారం పల్లి చట్నీ లేకపోవడం, దాని స్థానంలో టమాటా చట్నీ ఉండటంతో ఎమ్మెల్యే సిబ్బందిని నిలదీశారు. తనిఖీ అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ… పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని సమస్యలు గుర్తించామని, మెను అమలు కావడం లేదని, రాబోయే కాలంలో ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వైసీపీ సెటైర్లు

కూటమి ప్రభుత్వంలో పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగా ఉందనడానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆకస్మిక తనిఖీ ఘటనే నిదర్శమని వైసీపీ సెటైర్లు వేస్తుంది. వైసీపీ హయాంలో నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమాలతో పాఠశాలల నిర్వహణ మెరుగ్గా సాగిందని, కూటమి ప్రభుత్వంలో తిరిగి పాఠశాలల నిర్వహణ అధ్వాన్నమైపోయిందని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహెడ పండ్ల మార్కెట్ భూమికి కాంగ్రెస్ ఎసరు: హరీశ్ రావు
ప్రపంచంలోనే అత్యాధునిక వాయుసేనను వణికిస్తున్న అతిచిన్న వ్యవస్థ: ఏంటీ ఇరాన్ ‘మజిద్’?