గ‌త ప‌దేండ్ల‌లో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ‌లో పాల‌న

గ‌త ప‌దేండ్ల‌లో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ‌లో పాల‌న

హైద‌రాబాద్ : గ‌త ప‌దేండ్ల‌లో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ‌లో పాల‌న కొన‌సాగింద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేర్కొన్నారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పుతో ప్రకటించింది అని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. 75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్స్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పాల్గొని జాతీయ జెండా ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగించారు.

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా తెలంగాణ ప్రజలకు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రాసుకుని 74 ఏళ్లు దిగ్విజయంగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో దేశం ముందుకు సాగడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ ఘనత రాజ్యాంగ నిర్మాతలకు, ఈ దేశ ప్రజలకు దక్కుతుంది అని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలే కార్యోన్ముకులై తమ పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, ఆ పాలనకు చరమగీతం పాడే అవకాశం కూడా రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కే. గడచిన 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పుతో ప్రకటించింది అని ఆమె తెలిపారు.

పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం అని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్నీ వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది అని త‌మిళిసై పేర్కొన్నారు.