నేడే రెండో టెస్ట్‌.. జ‌డేజా, కేఎల్‌,కోహ్లీ లేకుండా బ‌రిలోకి దిగ‌నున్న టీమిండియా

నేడే రెండో టెస్ట్‌.. జ‌డేజా, కేఎల్‌,కోహ్లీ లేకుండా బ‌రిలోకి దిగ‌నున్న టీమిండియా

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా తొలి టెస్ట్ హైద‌రాబాద్ వేదిక‌గా ఆడ‌డ‌గా, ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మి పాలైంది. ఇక వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. తొడ కండరాల గాయంతో జడేజా, కుడి తొడలో నొప్పితో కేఎల్ రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరారు.ఈ నేపథ్యంలో వారి స్థానంలో ఎవరిని తీసుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాహుల్ సీటు కోసం సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ పోటీ పడుతున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా సౌరభ్ కుమార్‌లకు అవకాశం దక్కే అవకాశం ఉంది.

వైజాగ్ పిచ్ స్పిన్న‌ర్ల‌కి బాగా అనుకూలించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మ్యాచ్ కోసం నలుగురు స్పిన్నర్లు లేదా ఇంగ్లండ్ మాదిరిగా ఒక పేసర్‌తో వెళ్లాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇలా జ‌రిగితే వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఆడడం ఖాయం. మహ్మద్ సిరాజ్‌పై వేటు ప‌డే అవ‌కాశం ఉంది. ఇక అశ్విన్, అక్షర్‌తో పాటు స్పిన్ విభాగంలో కుల్దీప్‌కు అవకాశం లభిస్తుందా లేదా సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు జట్టులో చోటు దక్కుతుందా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఇక ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు కూడా జ‌డేజా అందుబాటులోకి రాడని ఓ ఎన్‌సీఏ అధికారి తెలిపాడు. చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు కూడా అందుబాటులో ఉండట్లేదని సమాచారం.

ప్రస్తుతం మహమ్మద్ షమీ లండన్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్ర‌త్యేక‌ వైద్యం చేయించుకుంటున్నాడు. అత‌ను ఐపీఎల్ 2024లోనే రీఎంట్రీ ఇస్తాడని ఓ ప్రముఖ వెబ్‌సైట్ చెప్పుకురాగా, మ‌రి కొంద‌రు మూడో టెస్ట్ వ‌ర‌కు వ‌స్తాడ‌ని చెబుతున్నారు. ఇక కోహ్లీ కూడా మూడో టెస్ట్‌కి అందుబాటులో ఉండ‌డ‌ని అంటున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మొత్తానికి ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌కు ముందు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పాలి. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లతో బరిలోకి దిగనుండ‌గా, వారు ఎంత మేర‌కు రాణిస్తార‌నేది చూడాలి.