Godrej | రెండుగా చీలుతున్న గోద్రెజ్ గ్రూప్.. ఎవరెవరికి ఏ కంపెనీలంటే..!
Godrej | దేశంలో టాటా గ్రూప్ సంస్థల మాదిరిగానే గోద్రెజ్ గ్రూప్ సంస్థలు కూడా ఫేమస్. తాళాలు, బీరువాలు మొదలుకొని సింతాల్, షీకాకాయ్, నంబర్ 1 సబ్బుల దాకా పలు రకాల ఉత్పత్తులతో గోద్రెజ్ కంపెనీ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గోద్రెజ్ కంపెనీ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతోంది. అయితే 127 ఏళ్ల వ్యాపార చరిత్ర కలిగిన గోద్రెజ్ గ్రూప్ యాజమాన్యం (Godrej Family) త్వరలోనే రెండుగా విడిపోనుంది. ఈ మేరకు గోద్రెజ్ గ్రూపు యాజమాన్యం కంపెనీలను పంచుకోనుంది.

Godrej : దేశంలో టాటా గ్రూప్ సంస్థల మాదిరిగానే గోద్రెజ్ గ్రూప్ సంస్థలు కూడా ఫేమస్. తాళాలు, బీరువాలు మొదలుకొని సింతాల్, షీకాకాయ్, నంబర్ 1 సబ్బుల దాకా పలు రకాల ఉత్పత్తులతో గోద్రెజ్ కంపెనీ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గోద్రెజ్ కంపెనీ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతోంది. అయితే 127 ఏళ్ల వ్యాపార చరిత్ర కలిగిన గోద్రెజ్ గ్రూప్ యాజమాన్యం (Godrej Family) త్వరలోనే రెండుగా విడిపోనుంది. ఈ మేరకు గోద్రెజ్ గ్రూపు యాజమాన్యం కంపెనీలను పంచుకోనుంది.
రెండు వేర్వేరు కంపెనీలుగా..
గోద్రెజ్ కుటుంబంలోని ఆది గోద్రెజ్, ఆయన సోదరుడు నాదిర్ గోద్రెజ్ ఒక వైపుగా.. వారి దాయాదులు జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణ మరోవైపుగా వ్యాపారాలను పంచుకోనున్నారు. ఆది గోద్రెజ్, నాదిర్ గోద్రెజ్లకు ఐదు లిస్టెడ్ కంపెనీలున్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ దక్కనుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ అగ్రోవెట్, అస్టెక్ లైఫ్ సైన్సెస్ లాంటి లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్కు నాదిర్ గోద్రెజ్ చైర్పర్సన్గా ఉంటారు.
ఆగస్టులో నాదిర్ బాధ్యతలు
ఆది గోద్రెజ్ కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ ఈ గ్రూప్నకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్లకు అన్లిస్టెడ్ కంపెనీ గోద్రెజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ సంస్థలు దక్కనున్నాయి. ముంబైలోని అత్యంత విలువైన ఆస్తులు, భూములు కూడా వీరికే దక్కనున్నాయి. గోద్రెజ్ అండ్ బోయ్స్ కంపెనీ ఏరోస్పేస్, ఏవియేషన్, ఫర్నీచర్, ఐటీ సాఫ్ట్వేర్ రంగాలలో విస్తరించి ఉంది. గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్నకు జంషీద్ గోద్రెజ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. జంషీద్ గోద్రెజ్ సోదరి స్మిత కుమార్తె నైరికా హోల్కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటారు.
కుటుంబ చరిత్ర
లాయర్ నుంచి వ్యాపారవేత్తగా మారిన అర్దేషిర్ గోద్రెజ్, ఆయన సోదరుడు ఫిరోజ్షా కలిసి 1897లో గోద్రెజ్ కంపెనీని స్థాపించారు. అర్దేషీర్కు సంతానం లేకపోవడంతో ఆయన తమ్ముడు ఫిరోజ్షా సంతానానికి కంపెనీ వారసత్వంగా వచ్చింది. ఫిరోజ్షాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వీరు సోహ్రాబ్, దోసా, బుర్జోర్, నావల్. ఆది గోద్రెజ్, నాదిర్ గోద్రెజ్లు బుర్జోర్ గోద్రెజ్ కుమారులు. జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్లు నావల్ గోద్రెజ్ సంతానం. సోహ్రాబ్ గోద్రెజ్కు సంతానం లేదు. దోసా గోద్రెజ్కు ఒక కొడుకు రిషద్ గోద్రెజ్ ఉండగా రిషబ్కు కూడా సంతానం లేదు.