సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. సైబర్ జాగురుకతా దివాస్ సందర్భంగా స్థానిక గీతా కళాశాలలో విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్ధి సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువగా సైబర్ మోసాలకు సాధారణ ప్రజలు గురవుతున్నారని, ఆకర్షణీయ ఆఫర్ల వల వేసి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు ఏన్నో రకాలు గా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని అన్నారు.
విద్యార్థినిలు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, ఆన్లైన్ చాటింగ్ల మోసాలగు గురవుతున్నారన్నారు. నిరుద్యోగులు లోన్యాప్ల బారిన పడుతున్నారన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాల్లో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ బంధువులు, స్నేహితులు, అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
సైబర్ క్రైమ్ డిఎస్పీ అల్లం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే బాధితులు 1930 కు కాల్ చేసి డిటైల్స్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్, సీఐ సురేష్ , సెక్టరియల్ అధికారి సతీశ్, కళాశాల కరస్పాండెంట్ ప్రసాద రావు , ప్రిన్సిపాల్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.