కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేటి నుంచి అమ్మవారి దర్శన వేళలను కుదించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఇతర వైదిక కమిటీ సభ్యులు సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది దాదాపు 45 మంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. కొవిడ్ కారణంగా అర్చకుడు రాచకొండ శివప్రసాద్ మృతి చెందారు. దీంతో దుర్గగుడికి వచ్చే […]
కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేటి నుంచి అమ్మవారి దర్శన వేళలను కుదించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఇతర వైదిక కమిటీ సభ్యులు సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది దాదాపు 45 మంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. కొవిడ్ కారణంగా అర్చకుడు రాచకొండ శివప్రసాద్ మృతి చెందారు. దీంతో దుర్గగుడికి వచ్చే భక్తులు, ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకొని అమ్మవారి దర్శన వేళలను కుదించడంతోపాటు ఆలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. నేటి నుంచి రోజూ ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు.
అంతరాలయ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామని, రాత్రి 7 గంటలకు ఘాట్రోడ్డు, మహామండపం, మెట్ల మార్గాలను మూసివేయనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. అమ్మవారికి పంచహారతులు, ఏకాంత సేవ, ఇతర పూజలు ఏకాంతంగానే నిర్వహిస్తామన్నారు. రోజువారీ ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించకుండా పరోక్ష పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానాలయం, ఉప ఆలయాల్లో విధులు నిర్వహించే అర్చకులు భక్తులు తెచ్చే వస్తువులను చేత్తో తాకరాదని ఈవో ఆదేశించారు. సిబ్బందికి మాస్కులు తప్పనిసరి చేశారు. ఎవరైనా మాస్కులు ధరించకపోతే రూ.200 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులు ఆరడుగుల మేర భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గంటలకు క్యూలైన్లను సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజ్ చేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. ఆలయంలో మరుగుదొడ్లు, వసతి గృహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. సెక్యూరిటీ సిబ్బంది థర్మల్ గన్స్తో ఉష్ణోగ్రతను పరిశీలించిన తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతించాలని స్పష్టం చేశారు. దర్శనం అనంతరం భక్తులు గుంపులుగా చేరకుండా భౌతిక దూరం పాటించేలా చూడాలని ఈవో సూచించారు.