• Telugu News
  • /Edu career

UGC NET | యూజీసీ నెట్‌ ఎగ్జామ్‌ కొత్త డేట్‌ వచ్చేసింది.. షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్‌టీఏ..!

UGC NET | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందు జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ నెట్‌ ఎగ్జామ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.

Reported by: Mallanna | విద్య - ఉద్యోగం | Jun 29, 2024, 10:02 am IST
Read Time: 4 mins
UGC NET | యూజీసీ నెట్‌ ఎగ్జామ్‌ కొత్త డేట్‌ వచ్చేసింది.. షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్‌టీఏ..!

UGC NET | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందు జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ నెట్‌ ఎగ్జామ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. తాజాగా షెడ్యూల్‌ను వెల్లడించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 4 మధ్య నెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET) 2024 షెడ్యూల్ ప్రకారం జూలై 6న నిర్వహించనున్నట్టు తెలిపింది. మరోవైపు సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష జూలై 25-27 మధ్య జరగనుంది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో లెక్చర్‌షిప్‌లు, రీసెర్చ్ ఫెలోషిప్‌లు కోరుకునే అభ్యర్థులకు నెట్, సీఎస్ఐఆర్ పరీక్షలు కీలకమైన విషయం తెలిసిందే.

కాగా, ఇప్పటివరకు పెన్ను, పేపర్ విధానంలో జరిగిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌ను ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించినట్లు పేర్కొంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ స్కాలర్‌ల ఎంపిక కోసం జూన్ 18న దేశవ్యాప్తంగా రెండు విడతలుగా యూజీసీ-నెట్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పరీక్ష సమగ్రత దెబ్బతినడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్ష జరిగిన మరుసటి రోజే పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు నెట్‌, నీట్‌ పరీక్షల అంశంపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడంతో పార్లమెంట్‌ సోమవారానికి వాయిదాపడింది. పరీక్షల్లో అవకతవకలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి.