బ్రేక్ ఫాస్ట్లో చాలా మంది పూరీ ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా చికెన్, మటన్ కర్రీలు చేసుకున్నప్పుడు కూడా పూరీ చేసుకుని తింటుంటారు. ప్రధానంగా అల్పాహారంలో భాగంగా చేసే పూరీ కర్రీ చాలా మందికి కుదరదు. హాటల్స్లో అయితే పూరీ కర్రీని చాలా టేస్టీగా వండుతారు. కొన్ని చోట్ల అంతా టేస్టీగా ఉండదు. పూరీ కర్రీగా టేస్టీగా ఉంటే ఒక రెండు పూరీలు ఎక్కువగానే లాగించేస్తాం. మరి హోటల్ స్టైల్లో, ఆ టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే పూరీ కర్రీ తయారు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పూరీ కర్రీ విధానం ఏంటో తెలుసుకుందాం..
నూనె – 2 టీస్పూన్లు
ఆవాలు – అర టీస్పూన్
శనగపప్పు – 2 స్పూన్
మినపప్పు – 1 స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
కరివేపాకు – 1 రెబ్బ
ఎండుమిర్చి -2
ఉల్లిపాయలు – 250 గ్రాములు
పచ్చిమిర్చి – 2
బంగాళదుంప – 1 మీడియం సైజ్
అల్లం – అంగుళం
నిమ్మరసం – 1 స్పూన్
శనగపిండి – 2 టీస్పూన్లు
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నీరు- తగినంత
ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరగాలి. పచ్చిమిర్చిని పొడవునా రెండు భాగాలుగా కోయాలి. బంగాళాదుంపను ఉడకబెట్టుకోవాలి. ఇక శనగపిండిలో నీరు పోసి.. బాగా కలపాలి. ఇప్పుడు ఓ పాత్ర తీసుకొని స్టౌ వెలిగించాలి. దాంట్లో నూనె పోసి, వేగిన తర్వాత.. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగాక.. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
అనంతరం ఈ తాలింపులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పసుపు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయ్యేవరకు మాత్రమే ఉడికించాలి. బాగా మెత్తగా ఉడికిస్తే కూరలో దీని రుచి మీకు తెలియదు. ఉల్లిపాయలు కాస్త వేగాక.. దానిలో అరలీటరు నీరు వేసి.. ఉప్పు కూడా వేసి బాగా తిప్పి.. మరగనివ్వాలి. నీరు మరిగిన తర్వాత ముందుగా పేస్ట్గా తయారు చేసుకున్న పిండిని.. దీనిలో వేయాలి. పిండి ముద్దలు కాకుండా కలుపుతూ.. పిండిని వేయాలి.
శనగపిండి బాగా ఉడికిన తర్వాత బంగాళాదుంప ముక్కలను చిన్నగా కట్ చేసి అందులో వేయాలి. బంగాళాదుంప ముక్కలు ఉడికిన తర్వాత.. చివరగా నిమ్మరసం వేసి కిందకు దించాలి. నిమ్మరసం తప్పనిసరి కాదు. మీకు నచ్చితేనే కలపండి. చివర్లో తురిమిన కొత్తిమీరను గార్నిష్ కోసం వేసుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ పూరి కూర రెడీ. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పూరీ కర్రీని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది పూరీల రుచినే రెట్టింపు చేస్తుంది.