ఈ రోజు సెల్ ఫోన్ సాధారణ విషయం. అందరి దగ్గర దాదాపు కనిపిస్తూనే వుంటుంది.. అయితే దీన్ని మనం ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటాం. కొందరు నిలబడి, మరికొందరు కూర్చొని, ఇంకా కొందరు పడుకుని కూడా ఫోన్ వాడుతుంటారు.. అయితే పడుకొని ఫోన్ వాడితే వచ్చే నష్టాలేంటో తెలిస్తే మళ్లీ పడుకొని ఫోన్ చూడరని నిపుణులు చెబుతున్నారు. నేడు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు బానిసలుగా తయారవుతున్నారు. ఇంకా చెప్పాలంటే నిమిషం కూడా ఫోన్ లేదంటే పిచ్చోళ్లయేవారు ఎందరో ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. కొత్తగా మేసేజ్లు ఏం వచ్చాయోనని పట్టిపట్టి ఆత్రంగా చూస్తేనే ఉంటారు. తెల్లవారుజామున నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునేదాకా.. సోషల్ మీడియాలోని వివిధ మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్లలో ఎలాంటి లేటెస్ట్ ట్రెండింగ్స్ వచ్చాయోనని పైకీ క్రిందికీ ఒక సారి చెక్ చేస్తుంటారు.. ఇలా ఫోన్ను మితిమీరి ఉపయోగిస్తే మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.
అనేక సందర్భాల్లో మనం మన వీలును బట్టి కూర్చొని లేదా, నిలబడి, ఇబ్బంది అనిపిస్తే పడుకుని కూడా ఫోన్లను చూస్తునే వుంటాం. ఇలా కొంత మనకు ఉపశమనం కలిగించినప్పటికీ దీని వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. నిద్రపోయే ముందు సెల్ ఫోన్ల ను వాడితే వచ్చే తీవ్ర ఇబ్బందులేంటో తెలుసుకోవడం అవసరం. 1. అనేక మంది పిల్లలు రాత్రిళ్లు చదివి, పడుకొనే ముందు ఫోన్లను చూస్తుంటారు.. ఇలా తదేకంగా ఫోన్ చూడటం వల్ల మెడవెనుక, నడుము భాగములో నొప్పివచ్చే ప్రమాదం వుంది. అంతేకాదు చేతి కండరాల నొప్పి వస్తుంది.
2. కూర్చొని ఫోన్ చూడటం ఉపయోగకరంగా వుంటుంది. దీని వల్ల సెల్ ఫోన్ స్క్రీన్ కాస్త మనకు దూరంగా ఉంటుంది. అదే పడుకొని ఫోన్ చూస్తే కళ్లకు అది చాలా దగ్గరగా ఉంటుంది. ఈ పొజిషన్లో ఫోన్ చూడటం వల్ల కళ్లు బాగా దెబ్బతిని తొందరగా అలసిపోతాం. ఇది మన కళ్లలోని తేమను తీసివేస్తుంది. దీంతోమన కళ్లు పొడిబారి నొప్పి వస్తుంది. 3. చాలా సేపు ఉన్నఫలంగా అదేపనిగా మొబైల్ ఫోన్లను వాడితే, తల నొప్పి, కంటినొప్పి, నడుము నొప్పి , వెన్నునొప్పి, భుజం నొప్పి వంటి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
4. మొబైల్ ఫోన్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత రేడియేషన్ మన శరీరంపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వీటివల్ల కంటి చూపు తగ్గుతుంది. పోగా ఇతర మరికొన్ని కంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది. దీన్ని దృష్టిలో వుంచుకొని మొబైల్ ఫోన్లను చాలా జాగ్రత్తగా వాడాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికే తలనొప్పి వుంటే, కంటి చూపు కూడా తక్కువగా వుంటే ఫోన్లను ఈ పద్ధతిలో చూడవద్దని స్పష్టం చేస్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు మనం మొబైల్ ఫోన్లను ఎక్కువగా చూడటం మంచిదికాదు. ఇది దీర్ఘ కాల నిద్ర సమస్యలకు దారితీస్తుంది.
ఈ నష్టాలను మనం ఎలా నివారించగలం మొబైల్ ఫోన్లను వాడటం వల్ల మనకు సమస్యలు ఏ ఇబ్బందులూ రాకుండా వుండాలంటే అరగంటకు మించి సెల్ ఫోన్లను చూడకుండా ఉండాలి. ఒక వేళ మొబైల్ ఫోన్ వాడాల్సే వస్తే ప్రతి 5 నిమిషాలకోసారి కళ్లు రెప్పలు ఆర్పి కొద్దిసేపు అలాగే వుండి పోండి. ఇది మీ కళ్లను తేమగానూ చల్లగానూ ఉంచుతుంది. అలాగే కంటి చికాకులు కూడా రాకుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. మీరు మొబైల్స్ ను చూసినప్పుడల్లా, వీలైతే నిటారుగా ముందుకు కొంత వంగి చూడండి. దీనివల్ల వెన్నుకాని మెడకాని నొప్పుల సమస్యలు ఎదురవవు.. కంటిచూపు దెబ్బతినకుండా సరిగా వుండాలంటే మొబైల్ ఫోన్ ను మనకు కొంత దూరంలో ఉంచాలి. అలాగే ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఏదైనా వస్తువును 20 సెకన్లపాటు చూడాలని అంటున్నారు.