నిజమా.. ‘ఉప్పు’ అంతపని చేసిందా? ఉప్పు, సామాన్యుడికి నిత్యావసర వస్తువు, కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పన్ను రూపంలో డబ్బు సంపాదించిపెట్టే వస్తువు. 1850ల చివరి నాటికి, ఈస్ట్ ఇండియా సంస్థ మొత్తం ఆదాయంలో 10 శాతం ఉప్పు మీద వేసే పన్ను నుండే వచ్చేది
దాదాపు 150 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో, పడమటి ప్రాంతం నుండి తూర్పు ప్రాంతానికి ప్రయాణించాలంటే 10 అడుగుల పైన ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద కంచెను దాటాల్సివచ్చేది. ఈ కంచె ముళ్లతుమ్మలు, జెముడు చెట్లు, కోరండి చెట్లతో-దాదాపు 4000 కి.మీ ల కన్నా ఎక్కువ దూరమే నిర్మించబడింది. ఈ కంచె దాటే సమయంలో ఎవరిదగ్గరైనా ‘ఉప్పు’ అని పిలవబడే అమూల్యమైన వస్తువు ఉంటే, ఆ మహా కంచె దగ్గరకు, ఆ అమూల్యమైన వస్తువును తెచ్చినందుకు గానూ భారీ పన్నులు వసూలు చేసేవారు.
ఏంటా కంచె?
దీనిని ‘ఇన్లాండ్ కస్టమ్స్ లైన్'(Indian Customs Line) అని, ఇండియన్ సాల్ట్ హెడ్జ్ (Indian Salt Hedge) అని కూడా పిలిచేవారు. పంజాబ్ లోని సింధూ నది నుండి ఒడిశాలోని మహనది వరకు ఇది ఉండేది. ఇండియన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, ఏ.ఓ.హూమ్(Allan Octavian Hume), ఇన్లాండ్ కస్టమ్స్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ కంచెను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఒక పెద్ద రాతి గోడతో కంచె ఏర్పాటు చేద్దామన్న బ్రిటిష్ ప్రభుత్వ ఆలోచన, అందుకు అవసరమైన రాళ్ళ కొరత వల్ల ఆగిపోయింది. ఆ సమయంలో హూమ్ ముళ్ల చెట్లతో కంచెను నిర్మించే ఆలోచనను ప్రతిపాదించారు. దీనికి అప్పటి వైస్రాయ్ లార్డ్ నార్త్బ్రూక్ అనుమతించారు. అలా ముళ్ల చెట్లు, ఉప్పు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిపోతాయని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. బతికున్న ముళ్లమొక్కలను నాటడం వల్ల అవి క్రమంగా పెరిగి 12 అడుగుల ఎత్తుకు చేరుకుని, సహజమైన చెట్ల గోడలా తయారైంది. అప్పట్లో దీన్ని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తో పోల్చేవారు. 1869 నుండి 1881మధ్య 1200 మంది ఈ కంచె కోసం పని చేసారు. అప్పట్లో దీనికి 2 లక్షలు ఖర్చయింది.
ఎందుకు నిర్మించారు.?
ఉప్పు, సామాన్యుడికి నిత్యావసర వస్తువు, కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పన్ను రూపంలో డబ్బు సంపాదించిపెట్టే వస్తువు. 1850ల చివరి నాటికి, ఈస్ట్ ఇండియా సంస్థ మొత్తం ఆదాయంలో 10 శాతం ఉప్పు మీద వేసే పన్ను నుండే వచ్చేది.
ఇప్పటి ఒడిశా 1800లకు ముందు మరాఠా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ రోజులలో, ఉప్పు తయారీకి దేశం మొత్తం మీద ఒడిశా ప్రసిద్ధి గాంచింది. మరాఠా పాలకులు ఉప్పు మీద తక్కువ పన్ను వసూలు చేసేవారు. ప్రధానంగా మలంగి వర్గం వారు తయారుచేసే ఉప్పుకి నాణ్యతా, గిరాకీ ఉండేది. దేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి వర్తకులు ఉప్పుని కొనుగోలు చేసేవారు. అప్పటికి బ్రిటిష్, భారతదేశం మొత్తాన్నీ కాక, కొన్ని ప్రాంతాలనే పరిపాలించేవారు. వాటిలో బెంగాల్ ఒకటి. ఇతర బ్రిటిష్ ఇండియా భూభాగాల్లో ఉప్పుపై పన్నులు ఉన్నప్పటికీ, బెంగాల్లో పన్ను అత్యధికం. ఇతర ప్రాంతాల పన్నులు బెంగాల్ పన్ను రేటులో మూడో వంతు కంటే తక్కువే ఉండేవి.
బ్రిటిష్ ప్రభుత్వం కూడా తమ అవసరాల నిమిత్తం ఒడిశా నుండి ఉప్పు కొనుగోలు చేసేది. కానీ 18వ శతాబ్దం చివరినాటికి, ఇంగ్లాండ్ లోని చెషైర్ లో ఉప్పు తయారీ పుంజుకుంటున్న దశలో, అక్కడ తయారైన ఉప్పుని అమ్ముకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి భారీ మార్కెట్లు అవసరమయ్యాయి. కానీ చెషైర్ ఉప్పు, నాణ్యతలో కానీ లేదా ధరలో కానీ, ఒడిశా ఉప్పుతో పోటీ పడలేకపోయింది. అందుకే 1790లో బ్రిటిష్ , ఒడిశాలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉప్పుని కొనుగోలు చేస్తామని ప్రతిపాదన చేసినప్పుడు, ప్రాంతీయ పరిశ్రమని దృష్టిలో పెట్టుకొని రఘుజీ భోన్సల(ఒడిశా మరాఠా పాలకుడు) దానిని తిరస్కరించారు. ఈ తిరస్కరణతో, బెంగాల్ లో ఒడిశా నుండి దిగుమతి అయ్యే ఉప్పుని నిషేధించారు. అయినా బెంగాల్ లో ఒడిశా ఉప్పు రవాణా తగ్గలేదు. ఒడిశా-బెంగాల్ మధ్య అడవులు దట్టంగా ఉండడం, కాపలా కూడా తక్కువగా ఉండటంతో, ఒడిశా నుండి బెంగాల్ కు ఉప్పు అక్రమ రవాణా మొదలైంది.
బెంగాల్ లో చాలా చోట్ల తనిఖీ కేంద్రాలు వెలిశాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకు తక్కువ జీతాలు ఇచ్చి, ఉప్పు అక్రమ రవాణాని పట్టుకున్నప్పుడు మాత్రం బోనస్ ఇచ్చేవారు. ఈ తనిఖీ కేంద్రాలు, ఉప్పు రవాణాని పెద్దగా నిరోధించలేకపోయాయి. దారి పొడవునా కస్టమ్స్ అధికారుల పహరా లేకపోవడం, కస్టమ్స్ సిబ్బందిలో అవినీతి మరియు ఉప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల వైపు బెంగాల్ విస్తరించడం దీనికి కారణం. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు, 1843లో ఈ అక్రమ రవాణాను ఆపడానికి కస్టమ్స్ శాఖ కమిషనర్, జీ.హెచ్.స్మిత్ ‘ఇన్లాండ్ కస్టమ్స్ లైన్’ ప్రతిపాదన చేసాడు. మొదట దిల్లీ, ఆగ్రా మరియూ బెంగాల్ వరకే పరిమితమైన ఈ కంచె, 1869లో పంజాబ్ విలీనం తరవాత, అక్కడి వరకూ విస్తరింపచేశారు.
1803లో ఆంగ్లో-మరాఠా యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిష్ రాజ్, ఒడిశాను బెంగాల్ లో భాగంగా చేశారు. 1804లో ఒడిశా ఉప్పు పరిశ్రమని బ్రిటిష్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉప్పుని ప్రభుత్వానికి తప్ప బయట అమ్మరాదనీ, ఎవరి దగ్గరైతే ఉప్పు నిల్వలు ఉన్నాయో, వారు తక్షణం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని ఆదేశించింది. ఉప్పుని రవాణా చేయరాదని హుకుం జారీ చేసింది. కనీసం తీరప్రాంతంలో పేరుకున్న ఉప్పుకుప్పని గోకడం కూడా నేరంగా పరిగణింపబడేది. క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వమే ఉప్పు తయారీని చేపట్టింది. దాంతో మలంగీల జీవనాధారం దారుణంగా దెబ్బ తిన్నది. వారి పన్నుల మీద ఆధారపడే జమీందార్లు నష్టపోయారు. దేశీయ ఉప్పు పరిశ్రమ కుదేలు అయిపోయింది.
కొన్ని సమస్యలకు పరిష్కారంగా ఏర్పాటు చేసిన ఈ కంచె కొన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వ అనుమతులు ఉన్న సరుకుల రవాణాలో కూడా జాప్యం జరిగేది. పైగా కొంత మొత్తం లంచం ముట్టచెప్తే చాలు, ఒంటెల ద్వారా లేదా మూటలను కంచె అవతలకి విసిరేయడం ద్వారా ఉప్పు అక్రమ రవాణా షరా మామూలుగానే జరిగేది. 1879లో దేశవ్యాప్తంగా ఉప్పు మీద ఒకే విధమైన పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పుడు, కంచె అవసరం లేకుండా పోయింది. ఉప్పు తయారీ కేంద్రాల వద్దే పన్ను విధించడం మొదలుపెట్టారు. 1895 వరకూ పంజాబ్ లో ఉప్పు రెవెన్యూ శాఖ, కంచె దగ్గర పహారా కాసేది.
ఈ ఉప్పుకు కప్పం అనే వింత శాసనమే మహాత్మాగాంధీ 1930లో దండి వరకు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి కారణమయ్యింది. అప్పుడు దాదాపు 80000 మందిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. చివరికి 1946లో భారత మధ్యంతర ప్రభుత్వం ఉప్పు కప్పాన్ని రద్దు చేసింది.
అప్పట్లో ఆ కంచెను ఫోటోలు తీసిన దాఖలాలైతే లేవు. ఇప్పుడు ఆ కంచె దాదాపు నాశనం అయిపోయింది. ఇప్పటికీ పాలీఘడ్ లాంటి కొన్నిచోట్ల కంచె ఆనవాళ్లు కనబడుతుంటాయి. చాలా చోట్ల రైతులు ఈ కంచెను నరికి ఆ స్థలాన్ని పొలాల్లో కలిపేశారు. మరి కొన్ని చోట్ల చెట్లు ఎండిపోయాయి. కొంత భాగం రోడ్లు-, ఇతర రవాణా మార్గాల నిర్మాణం కోసం తొలగింపబడింది.కానీ, ఇప్పడు మనం ‘కేవలం’గా పరిగణిస్తున్న ఉప్పు కోసం ఇంత తతంగం నడిచిందా అనేది మాత్రం ఆశ్చర్యం కలిగించకమానదు.
సౌజన్యం : ప్రత్యూష్ పరుచూరి, యుకె.