రష్యాలోని ఒక నదిలో రసాయనిక వ్యర్థాలు కలవడంతో నది నీళ్లు నెత్తురును తలపిస్తున్నాయి.
నదీజలాలు చూడటానికి నీలం రంగులో ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు లేత గోధుమ వర్ణంలో కనిపిస్తాయి. కానీ.. రష్యాలో ఒక నదిలో నెత్తురు పాతున్నదా? అనిపిస్తున్నది. కెమెరావో ప్రాంతంలోని ఆ నదిపేరు ఈస్కీటింక. ఉన్నట్టుంది ఇది ఇలా అరుణవర్ణాన్ని పులుముకోవడం చూడటానికి విచిత్రంగా ఉన్నా.. ఎందుకు ఇలా జరిగిందన్న అంశం ఆందోళన రేకెత్తిస్తున్నది. పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పుపై వాతావరణ నిపుణులు దృష్టిసారించేలా చేసింది. ప్రకృతికి విరుద్ధంగా జరుగిన ఈ మార్పు పెను వినాశానికి సంకేతంగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు.
నెత్తురు ప్రవహిస్తున్నట్టు ఉన్న ఈ నది ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒక కలుషిత రసాయన వ్యర్థాలు నదిలో కలవడం వల్లేనే నీరు ఎర్రగా మారినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. కెమెరోవా పట్టణంలోని మురుగనీటి వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం వల్లే ఈ దుష్పరిణామం సంభవించిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. ఇటువంటి ఘటన గతంలో 2020 జూన్ నెలలో ఆ ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షించిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
అప్పుడు కూడా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొంటున్నారు. ఆ సమయంలో జరిగిన పరిశోధనల వల్ల ఆ విధంగా రంగు మారటానికి కారణాలను వెలికి తీశారు. నోర్లిస్ సైబీరియా ఉత్తరానగల పారిశ్రామిక ప్రాంతంలోని ఒక పవర్ స్టేషన్లోని డీజిల్ రిజర్వాయర్ దెబ్బతిని, అందులోని ఇంధనం మొత్తం నదిలో కలిసింది. దాంతో రంగు మారింది. దాదాపు పదిహేను వేల టన్నుల డీజిల్ నదిలో కలిసిందని అంచనా వేశారు. ఈ దుర్ఘటనలో ఆ ప్రాంత ప్రభుత్వం స్పందించి పెద్ద ఎత్తున నదిని శుభ్రం చేయడంతో కొంతకాలానికే నది మళ్లీ పూర్వ స్థితికి చేరుకున్నది.