CM Revanth Reddy| వరల్డ్ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లలో తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ
మా పాలనతో 3లక్షల 28 వేల కోట్ల పెట్టబడుల సమీకరణ
విధాత, హైదరాబాద్ : ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని..దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్ , బల్క్ డ్రగ్స్ లో 43 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ (ICHOR BIOLOGICS) కొత్త యూనిట్ కు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదేనని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మా ప్రభుత్వం పారిశ్రామికాభివృద్దికి మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తుందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3లక్షల 28 వేల కోట్లు పెట్టుబడులు సాధించామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందుకు జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని కోరారు.