అన్నదాతకు ఆత్మ బంధువు ‘రైతు బంధు’: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట కుసుమవారిగుడెంలో జాతీయ రైతు దినోత్సవంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విధాత: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతన్నల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చారని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవంను పురస్కరించుకుని సూర్యాపేటలోని కుసుమవారిగుడెంలో పౌల్ట్రీ రంగంలో రాణిస్తున్న దివ్యాంగ రైతు శంకర్‌ను మంత్రి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో […]

  • By: krs    latest    Dec 24, 2022 3:09 AM IST
అన్నదాతకు ఆత్మ బంధువు ‘రైతు బంధు’: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట కుసుమవారిగుడెంలో జాతీయ రైతు దినోత్సవంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

విధాత: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతన్నల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చారని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవంను పురస్కరించుకుని సూర్యాపేటలోని కుసుమవారిగుడెంలో పౌల్ట్రీ రంగంలో రాణిస్తున్న దివ్యాంగ రైతు శంకర్‌ను మంత్రి సన్మానించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రైతుబంధు కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుందని తెలిపారు. రైతుబంధుతో ఇప్పటి వరకు 9 విడతల్లో రూ. 57,882 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు.10వ విడత నిధులు రూ. 7,600 కోట్లు ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేస్తామన్నారు. రైతుబంధు సుమారు 66 లక్షల మంది తెలంగాణ రైతులకు లబ్ది కలుగుతుందన్నారు.

అప్పురూపంలో కాకుండా పెట్టుబడి రూపంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్నదాతలకు ఆర్థిక సహాయం చేసిన తొలి ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. రైతు బీమాతో రైతన్నలకు ఒక గొప్ప భరోసాను అందించిన మానవీయ సర్కారు బి.ఆర్.ఎస్ సర్కార్ అని మంత్రి పేర్కొన్నారు. రైతుల తరుపున ప్రభుత్వమే బీమా ప్రీమియంను చెల్లించి దురదృష్టవశాత్తు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 5 ల‌క్ష‌లు ఇస్తూ భరోసాను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దే అని స్ప‌ష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 94 వేల రైతు కుటుంబాలకు రూ. 4700 కోట్ల బీమా పరిహారం చెల్లించామన్నారు.

రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయిన చెరువులకు స్వరాష్ట్రంలో “మిషన్ కాకతీయ”తో ప్రాణంపోశారని చెప్పారు. మిషన్ కాకతీయతో తెలంగాణలోని 27,625 చెరువులకు పునర్వైభవం వచ్చిందన్నారు. ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు.సమైక్య రాష్ట్రంలో పెండింగ్‌లో పడ్డ ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేసి కాళేశ్వరం లాంటి నూతన ప్రాజెక్టులతో తెలంగాణను ఒక సజీవ సాగునీటి క్షేత్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ సాగునీటి రంగ విజయాలతో కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అన్న తీరుగా అర్థం మారిందన్నారు.కే

సీఆర్ పట్టుదల, చిత్తశుద్దితో సమైక్య రాష్ట్రంలో దండుగలా ఉన్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందన్నారు. విద్యుత్, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడంతో లక్షలాది అదనపు ఎకరాలు సాగులోకి వచ్చి తాగు, సాగునీటికి కొరత లేకుండా కడుపునిండా నీళ్లు దొరుకుతున్నాయన్నారు . 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న తిండిగింజల ఉత్పత్తి ఇవాళ రికార్డ్ స్థాయిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని రైతు సర్కార్ కే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

పండించిన ధాన్యాన్ని కొనమని కేంద్రం మొండికేస్తే వేలాది కోట్ల రూపాయలతో పండిన ప్రతీ గింజను కొన్న రైతు పక్షపాతి ప్రభుత్వం తమదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ సంక్షోభాన్ని తట్టుకోలేక పంట పొలాల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఆహార ధాన్యాలను పండిస్తూ అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు.

2014కు ముందు కరెంటు కోతలు, రాత్రి కరెంటు సరఫరాతో రైతన్నలు బోరు బావుల దగ్గర ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో ట్రాన్స్‌ఫార్మ‌ర్లు కాలిపోయి కోతలు ఏర్పడడం లేదన్న మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 24 గంటలు వ్యవసాయ విద్యుత్తు ఎక్కడ లేదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆరు గంటల కరెంటుతో గోస పడ్డ రైతన్నకు సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటును అందిస్తున్నారని తెలిపారు. రూ. 36,703 కోట్లతో విద్యుత్ రంగంలో మౌలిక వసతులను కల్పించి సాలీనా దాదాపు రూ 10,500 కోట్ల వ్యయంతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు అందిస్తుందన్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందన్నారు . అన్నదాతలనుఏకం చేసి, వారిని చైతన్యపరచడానికి ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి, ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతువేదిక లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 572 కోట్లతో 2601 రైతువేదికలను తమ ప్రభుత్వం నిర్మించిందన్నారు. రైతు సంక్షేమం విషయంలో ఇదొక అపూర్వ విజయం అన్నారు.