నారా లోకేశ్కు సీఐడీ నోటీస్లు

- ఆక్టోబర్ 4న విజయవాడ కార్యాలయంలో విచారణ
విధాత: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14 నిందితుడిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను పేర్కోన్న సీఐడీ శనివారం ఆయనకు నోటీస్లు అందించింది. న్యూఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న నారా లోకేశ్ వద్దకు వెళ్లిన ఏపీ సీఐడీ బృందం ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందచేశారు.
ఆక్టోబర్ 4వ తేదీన ఉదయం 10గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీస్లో పేర్కోన్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి రిమాండ్ చేసింది. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును సైతం నమోదు చేశారు.
ఈ కేసులో లోకేశ్ను ఏ14 నిందితుడిగా సీఐడీ పేర్కోంది. తమ వారి భూములకు ధరలు పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేశారని ఆరోపిస్తూ అప్పుడు మంత్రిగా ఉన్న లోకేశ్ను నిందితుడిగా చర్చింది. కాగా ఢిల్లీ వరకు వచ్చి తనకు నోటీస్లు ఇవ్వడానికి వచ్చిన సీఐడీ బృందం అధికారులకు టీ, కాఫీ, స్నాక్స్ అందించారు.
అంతకుముందే తనకు వాట్సాప్లో నోటీస్ ఇచ్చారు కదా మళ్లీ ఇంత దూరం ఎందుకు వచ్చారని లోకేశ్ ప్రశ్నించారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీస్లను లోకేశ్ స్వీకరించారు. నోటీస్లోని 41-3,41-4 సెక్షన్ల గూర్చి లోకేశ్ సీఐడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.