స్వరాష్ట్రంలో నల్లగొండకు బీఆర్ఎస్ అన్యాయం విధాత : పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అధికార బిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తేట తెల్లమైందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మానసికంగా సిద్ధమయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ గుర్రంపోడు మండలంలో కొనసాగిన పాదయాత్ర సందర్భంగా భట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాదయాత్ర అవుట్ డేటెడ్ కాదని, ఎప్పుడైన అడ్వాన్స్ డ్ సిస్టం అన్నారు. ప్రజా నాయకుడు అనే వాడికి […]
విధాత : పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అధికార బిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తేట తెల్లమైందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మానసికంగా సిద్ధమయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ గుర్రంపోడు మండలంలో కొనసాగిన పాదయాత్ర సందర్భంగా భట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పాదయాత్ర అవుట్ డేటెడ్ కాదని, ఎప్పుడైన అడ్వాన్స్ డ్ సిస్టం అన్నారు. ప్రజా నాయకుడు అనే వాడికి వివిధ వర్గాల ప్రజలను కార్యకర్తలను, నాయకులను, నేరుగా కలుసుకొని, వారి సమస్యలు విని, పరిష్కార మార్గాలను ఆలోచించి నిర్ణయించుకునే అద్భుత సాధనం పాదయాత్ర అన్నారు. 1000కిలో మీటర్ల పాదయాత్రతో ప్రజా సమస్యలపై మంచి అవగాహన అనుభవం పెరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ భావజాలంతో నిత్యం ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసే నాయకుడిగా తాను కూడా సీఎం పదవిని ఆశించడంలో తప్పులేదని, ముందుగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, సీఎం ఎవరనేది సోనియాగాంధీ, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
తెలంగాణ వస్తే మాకు కృష్ణ జలాలు వస్తాయని నమ్మిన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు పట్ల చూపిన నిర్లక్ష్యం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు నీటి కేటాయింపులు చేయకపోవడం ద్వారా తీరని అన్యాయం చేసిందన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిధులు.. కృష్ణా నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా జిల్లా ప్రజలకు కృష్ణ నీళ్లు ఎందుకు ఇవ్వలేదని తాను జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ని, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రశ్నించానన్నారు.
తొమ్మిదేళ్లుగా సొరంగం ప్రాజెక్టు పూర్తి చేయలేని తమ అసమర్థతను అంగీకరిస్తూ, వారి నాయకుడైన కేసీఆర్ వద్దకు వెళ్లి నిధులు అడగలేమని, ఆయన ముందు నిలబడలేమని, అశక్తులమని ప్రజలకు చెప్పి క్షమాపణ చెప్పాలన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 9 ఏళ్లలో జిల్లా ప్రజలకు కృష్ణ నీళ్లు ఎందుకు అందించలేదని గుత్తాను ప్రశ్నిస్తే ఆయన తన పంచే, గోసి గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆనాడు ఏఎంఆర్పి ప్రాజెక్టుకు చంద్రబాబు నిధులు ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేశానని చెప్పుకున్న గుత్తా 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ నుండి నిధులు సాధించలేనందున ఇప్పుడు కూడా రాజీనామా ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
ఇక జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని సైతం సొరంగం ప్రాజెక్టు అసంపూర్తి పై ప్రశ్నిస్తే, ఆయన మంత్రిగా తొమ్మిదేళ్లలో నిధులు ఎందుకు తేలేదో చెప్పకుండా, డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై సమాధానం చెప్పకుండా, కాంగ్రెస్ పాలనలో నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నామంటూ లస్కర్లు, ఇంజనీర్లు చేసే విధులను చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జగదీష్ రెడ్డికి వారి నేత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ గడీ సంస్కృతి నేపథ్యంతో, భూస్వామ్య మనస్తత్వంతో వచ్చిన మాటలతో కాంగ్రెస్ నాయకులను ముక్కు నేలకు రాయాలంటు మాట్లాడడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అదిలాబాద్ మొదలుకొని నల్గొండ జిల్లా వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇసుక దందాలు, మట్టి దందాలు, వందల ఎకరాల్లో ఫామ్ హౌజ్ ల నిర్మాణాలతో విలాసంతమైన జీవితాలకు అలవాటు పడ్డారన్నారు.
తెలంగాణ రాకమందు వారి ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్నో ఒకసారి ప్రజలు భేరీజు వేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిజాం ప్రభువుగా, ఎమ్మెల్యేలు మంత్రులు జాగిర్దారీ, దేశముఖ్ ల మాదిరిగా తెలంగాణ వనరులను దోచుకుంటున్నారన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి వంటి నాయకుడు నేడు నలగొండ జిల్లా ప్రజలకు ఉండటం దురదృష్టకరమన్నారు.
గతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడి వారి కోసం తమ ఆస్తులను ఖర్చుపెట్టి, జిల్లా పౌరుషానికి ప్రతీకగా, ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు రావి నారాయణరెడ్డి వంటి ఎందరో కమ్యూనిస్టు, కాంగ్రెస్ నేతలు, మంత్రులు పనిచేసిన జిల్లాలో అవినీతిపరుడైన జగదీష్ రెడ్డి మంత్రిగా రావడం విచారకరమన్నారు.
తెలంగాణ వనరులు దోచుకోబడిన ఉమ్మడి రాష్ట్రంలోనే కల్యాణ లక్ష్మి కంటే ఎక్కువగా బంగారు తల్లి పథకంతో ప్రయోజనం అందిందని, రేషన్ బియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకులు అందాయని, భార్యాభర్తలు ఇద్దరికీ పింఛన్ అందిందని, ఇందిరమ్మ ఇల్లులు అడిగిన వారికి వచ్చాయని, మరి ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో అవన్నీ ఎందుకు లేవో ప్రజలు ఆలోచించాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అమలైన వ్యవసాయ సబ్సిడీలు, పంట నష్టపరిహారం ధనిక రాష్ట్రమైన స్వరాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మిషన్ కాకతీయతో 24 వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో మట్టిని అమ్ముకొని ఆ పార్టీ నాయకులు అంతే ప్రజాదనం దోపిడీ చేశారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కంటే అధికంగా తెలంగాణలోనే సహజ వనరుల దోపిడీ, ప్రజాసంపద దోపిడీ సాగుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వందల ఎకరాల ఫామ్ హౌస్ కల్చర్ కు ఎదిగిపోగా, ప్రజల జీవితాలలో మాత్రం ఎదుగుదల లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ప్రణాళిక మేరకు అన్ని హామీలు అమలుచేసి పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల కష్టనష్టాలను పరిష్కరిస్తుందన్నారు. తెలంగాణ బడ్జెట్ ను సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న తలంపు ఉంటే ఖచ్చితంగా హామీల అమలు సాధ్యమన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక దిశగా పార్టీ పరంగా సర్వే కసరత్తు సాగుతుందని పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పని చేసే వారికి, ప్రజల ఆదరణ ఉన్నవారికి తప్పకుండా పార్టీ గుర్తింపునిస్తుందన్నారు. పాదయాత్రలో చోటుచేసుకుంటున్న తోపులాటలు వర్గ పోరు కాదని, నాయకులు పాదయాత్ర స్వాగతానికి పడుతున్న పోటీలు మాత్రమే అన్నారు.