BJP |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని అవి రెండూ బొమ్మ బొరుసు లాంటివని కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ గతంలో కలిసి పని చేశాయని గుర్తు చేస్తూ గతంలో 18 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే 12 మంది బీఆర్ ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవని తమ పార్టీ పై రెండు పార్టీలు కలిసి చేస్తున్న విషప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన అనంతరం తొలిసారి కిషన్ రెడ్డి శుక్రవారం భారీ కాన్వాయ్తో వరంగల్ చేరుకున్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు.
కెసిఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేయాలని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నదో చూస్తున్నామని చెప్పారు. పర్సెంటేజీలు, కమీషన్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. భూమి, ఇసుక, రియల్ ఎస్టేట్, గ్రానైట్ ఏ వ్యాపారం తీసుకున్న మా వాటా ఎంత అని అడుగుతున్నారంటూ మండిపడ్డారు.
కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా కీలకమైన సమయంలో జరుగుతున్న ఈ బహిరంగ సభలో మోడీ కెసిఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పిలుపునిస్తారంటూ కిషన్ రెడ్డి చెప్పారు.
బీజేపీ మాత్రమే కుటుంబ పాలనను అంతమొందించగలదన్నారు. బీజేపీ నీతివంతమైన, ప్రజాస్వామ్యబద్ద న్యాయమైన పాలన చేయగలదని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను బిజెపి అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈసారి ప్రజలు తమని ఆశీర్వదించాలని కోరారు. కవిత అరెస్ట్ చూడాల్సిన పని బీజేపీది కాదు, సీబీఐ పనని ఆయన అన్నారు.
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేస్తారని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రి సచివాలయంకు పోయే పరిపాలన కావాలని అన్నారు. గత 9 ఏండ్లుగా మోడీ ప్రభుత్వం నీతిమంతంగా పనిచేస్తున్నదన్నారు.
వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోడీదని కిషన్ రెడ్డి చెప్పారు. వరంగల్ జిల్లాకు టెక్స్టైల్ పార్క్ కేంద్రమే మంజూరు చేసిందన్నారు. నేషనల్ హైవే ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైలు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో భవిష్యత్లో రైలు ఇంజన్ సహా వ్యాగన్లు, కోచ్లు ఏమైనా తయారు చేసుకోవచ్చన్నారు.
అనుకున్నదానికంటే పెద్ద పరిశ్రమనే కాజిపేటకు వచ్చిందని వివరించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ ఎయిర్పోర్టు అంశం మొదటిగా తీసుకుంటామన్నారు. ఓరుగల్లు జనాలు మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి నాయకులు ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, ధర్మారావు, కొండేటి శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.