BRS | కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత విద్యుత్కు మంగళమే: మంత్రి జగదీష్ రెడ్డి
BRS రైతాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమిస్తాయి: మంత్రి జగదీష్ రెడ్డి విధాత: కాంగ్రెస్ పార్టీకీ ఓటేస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు మంగళం పాడినట్లే అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలంగాణా రైతాంగానికి స్పష్టం చేశారు. అధికారం లోకి వస్తే రైతాంగానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటననే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం బిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]

BRS
- రైతాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమిస్తాయి: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: కాంగ్రెస్ పార్టీకీ ఓటేస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు మంగళం పాడినట్లే అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలంగాణా రైతాంగానికి స్పష్టం చేశారు. అధికారం లోకి వస్తే రైతాంగానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటననే ఇందుకు నిదర్శనమన్నారు.
ఈ మేరకు మంగళవారం ఉదయం బిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ అంటూ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన మాటలు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ గానే చూడాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. పొరపాటున రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ పాము కాట్లు, తేలు కాట్లకు బలి కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
పి సి సి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏమో వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటారు, మరోవైపు అదే పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమో అధికారంలోకి వస్తే దామరచర్ల వద్ద నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ రద్దు అంటారు… ఇటువంటి రద్దు గాళ్లను, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలూ శాశ్వతంగా రద్దు చేశారన్నారు. అయినా ఆ పార్టీ నేతలు ఇంకా గుణపాఠం నేర్వలేదని ఆయన మండిపడ్డారు.
బిఆర్ఎస్ నేతలు ఎవరికీ టచ్ లో లేరని, యావత్ తెలంగాణా సమూహం బిఆర్ఎస్ కే టచ్ లో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ను ఎకసెక్కం చేసి ఎగతాళి చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైనా.. రేవంత్ రెడ్డి రూపంలో ఆయన నీలి నీడలు తెలంగాణా రైతాంగాన్ని శాపగ్రస్తంగా వెంటాడుతున్నాయని ఆయన తెలిపారు.
విద్యుత్ వైర్లు బట్టలు ఆరేసేందుకే అన్న చంద్రబాబు నాయుడి మాటలు నిజం చేసేందుకు ఆయన అనుంగు అనుచరుడిగా రేవంత్ పాట్లు పడుతున్నారన్నారు. అందులో భాగంగానే వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ ప్రకటన అంటూ ఆయన విరుచుకుపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పిస్తే తాము అధికారంలోకి వస్తే మూడు గంటలకు కుదిస్తాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రైతాంగంలో గందరగోళం సృష్టిస్తున్నదని ఆయన విరుచుకుపడ్డారు.
ఇదే ప్రకటన రేపో మాపో రాహుల్ గాంధీ, ఆయన చెల్లె ప్రియాంక గాంధీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అటువంటి పార్టీ అధినేత హోదాలో చేసిన ప్రకటన పై యావత్ తెలంగాణా రైతాంగం తిరుగుబాటు కు సన్నద్ధమౌతుందన్నారు. వ్యవసాయానికి మూడు గంటల ప్రకటన పై బిఆర్ఎస్ ఉద్యమిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై ఘాటైన విమర్శల దాడికి పూనుకున్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసన సభ్యులు నల్లగొండ జిల్లా బి ఆర్ ఎస్ ప్రెసిడెంట్ ఎన్.రవీంద్ర నాయక్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కే. ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.