కాలం తెచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవు ఇది
రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు

- బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
- సిరిసిల్లలో ఎండిన పంటల పరిశీలన
విధాత : రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సొంత నియోజకవర్గం పరిధిలోని సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను, సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను కేటీఆర్ పరిశీలించారు. జరిగిన పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పోయిన సంవత్సరం ఇదే సమయంలో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి మిడ్మానేరు నింపి రంగనాయక్ సాగర్ నుంచి సారంపల్లి, రామచంద్రపురం సహా ఇక్కడి గ్రామాలకు నీళ్లందించామన్నారు. కాంగ్రెస్ మాత్రం మూడు నెలల నుంచి మేడిగడ్డలోని మూడు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా నీటిని వృధా చేస్తుందని, అందుకే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు అని తాను చెబుతున్నాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని ఆరోపించారు.
రైతుల్లో భరోసా నింపడానికే బీఆరెస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఇప్పటిరకు చేయలేదని విమర్శించారు. రైతుబంధుకు కేసీఆర్ సర్కార్ రూ.7 వేల కోట్లు సిద్ధంచేసిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పంటసాయాన్ని ఆపిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన రైతుబంధు డబ్బులు ఇవ్వడలేదని విమర్శించారు. తాము రైతుల కోసం ఉంచిన డబ్బులను కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లకు ఇచ్చిందన్నారు.
కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, చివరికి వారిని కూడా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 14సార్లు ఢిల్లీకి పోవడం తప్ప రైతులను పరమార్శించే సమయం సీఎం రేవంత్రెడ్డికి దొరకడం లేదన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందునా ఎన్నికల కమిషన్ లేఖ రాసైనా అనుమతి తీసుకుని పంట నష్టపరిహారం ఇవ్వాలని, 2లక్షల రుణమాఫీ చేయాలని, రైతుబంధును రైతు భరోసా కింద కేసీఆర్ ఇస్తామన్నదానికే ఎక్కువ ఇస్తామని చెప్పినందునా 15వేల చొప్పున ఇవ్వాలని కోరారు.