Road Accident | మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డంపర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు సజీవ దహనయ్యారు. మరో 18 మంది వరకు గాయపడగా వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఘటనలో 11 మంది మృతి చెందినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్పీ విజయ్ ఖత్రీ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని గుణ ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. గుణ-ఆరోన్ రోడ్డులో డంపర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల వివరాలు తెలియరాలేదని, ఇంకా గుర్తించలేదని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
సమాచారం మేరకు బుధవారం రాత్రి బస్సు గుణ నుంచి ఆరోన్ వైపు వెళ్తున్నది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుణ జిల్లాలో డంపర్ను ఢీకొట్టి బోల్తాపడడంతో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమైనట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. చాలా మంది గాయాలయ్యాయి. అస్పల్ గ్రామస్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి క్షతగాత్రులను కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన గంట వరకు సంఘటనా స్థలానికి అంబులెన్స్లు రాలేదని పలువురు ఆరోపించారు. బస్సులో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను నియంత్రించారు. బస్సులో ప్రయాణించిన అంకిత్ కుష్వాహ అనే వ్యక్తి మాట్లాడుతూ బస్సు గుణ నుండి ఆరోన్ వైపు వెళుతోందని చెప్పాడు. తాను ముందు సీట్లో కూర్చున్నానని.. ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలిపాడు. అప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదని.. వెంటనే తేరుకొని బయటకు తాను.. స్నేహితుడు బయటికి వచ్చామని చెప్పాడు. ఆ తర్వాత నలుగురిని బయటకు తీశామని చెప్పాడు. ఆ తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. బస్సులోని వారిని కాపాడేందుకు తమవంతు ప్రయత్నం చేశామ చెప్పాడు.
ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికుల బస్సులో మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే గుణ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి.. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని సూచించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.