కులాల అంతరాలు చెరిపేస్తాం
జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి తెలిపారు

- అన్ని కులాలతో కలిపి రెసిడెన్షియల్స్
- అన్నికులాలవారితో ఇందిరమ్మ ఇండ్లు
- అభ్యున్నతికి బాబూ జగ్జీవన్రామ్ స్ఫూర్తి
హైదరాబాద్: జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి తెలిపారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉండేవని చెప్పారు. కానీ.. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చెరిపేయాలనుకుంటున్నామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో శంకుస్థాపన చేశామని తెలిపారు.
దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. గురువారం డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని గుర్తు చేశారు.
చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి..
విద్యార్థుల చదువుల మీద పెట్టేది ఖర్చు కాదని, అది వారి అభివృద్ధికి పెట్టుబడి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆరెస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయని గుర్తు చేశారు. లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లును ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమంతా మీరా కుమారిని ఎప్పుడూ గుర్తుచేసుకుంటుందని చెప్పారు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఒకసారి దొరల చేతిలో ఉంటే.. ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను అధ్యక్షా అని పిలవాల్సిందేనని చెప్పారు. కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారన్న రేవంత్రెడ్డి.. అసలు ఆ ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.