కేసీఆర్ పని అయిపోయిందని, కారు కార్ఖానాకు పోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇక కారును తుక్కు కింద అమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు
కాంగ్రెస్ను టచ్ చేస్తే కేసీఆర్ మాడిపోతారు
పంద్రాగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ
ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా హామీ
ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు
జిల్లాకు వేల పరిశ్రమలు, లక్షల ఉద్యోగాలు
20 ఏండ్లుగా బీజేపీ, బీఆరెస్ చేసిందేమీ లేదు
కాంగ్రెస్కు ఓటెయ్యండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
మెదక్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ పని అయిపోయిందని, కారు కార్ఖానాకు పోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇక కారును తుక్కు కింద అమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా హామీ ఇస్తున్నానని, ఆగస్ట్ 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల మేర వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మోదీ, కేడీ తొడుదొంగలని, ఇద్దరూ కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు.
డిసెంబర్లో కేడీని ఇంటికి పంపించామని, ఇక ఇప్పుడు మోదీని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి? ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డి కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త’ అని హెచ్చరించారు. శనివారం మెదక్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్కు రేవంత్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారని గుర్తు చేశారు. ఆమె హయాంలో మెదక్ జిల్లాకు అనేక పరిశ్రమలు వచ్చాయని, వాటిలో అనేక మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆరెస్ చేతిలోనే ఉందని, ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ, బీఆరెస్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. పదేళ్లు మోదీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా ఉన్నారని, ఈ పదేళ్లలో వీళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లడగాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తానని తెలిపారు.
బస్సు వేసుకుని దుబ్బాక వస్తాం..
దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానన్న గతంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన రేవంత్.. ‘మేమంతా బస్సులేసుకుని దుబ్బాక వస్తాం.. నువ్వు తెచ్చిన నిధులేంటో.. చేసిన అభివృద్ధి ఏంటో చూపించు’ అని సవాలు విసిరారు.
ఆదుకుంటుంటే.. ఓర్వలేక పోతున్న బీఆరెస్, బీజేపీ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని రేవంత్రెడ్డి చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రజా పాలన తమదని అన్నారు. రూ.22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నామని చెప్పారు. తాము ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కడుపు మండిన మోదీ, కేసీఆర్.. కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంటే.. చూసి ఓర్వలేక కేసీఆర్, మోదీ కాంగ్రెస్ను ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు.
పంద్రాగస్టులోగా రుణమాఫీ
‘తెలంగాణ రైతులకు ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది’ అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్, హరీశ్ హామీలు నెరవేర్చలేదని, కానీ.. వందరోజుల్లోనే తమను దిగిపొమ్మంటున్నారని విమర్శించారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని స్పష్టంచేశారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించే బాధ్యత మాదని చెప్పారు. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండానే అని చెప్పారు. బలహీన వర్గాల బిడ్డ నీలం మధును గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు.