2034 వరకు కాంగ్రెస్ పాలనే
కేసీఆర్ అనే దుర్మార్గుడి పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రo అన్ని రంగాల్లో సర్వనాశనం అయిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు

- తెలంగాణ అభివృద్ధి కోసం మోదీతోనైనా, కేడీతోనైనా పోరాటమే!
- అన్యాయం చేస్తే చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తా
- వారిద్దరి పదేళ్ల పాలనలో తెలంగాణ విధ్వంసం
- మాజీ సీఎం కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ
- మోదీకి వినతిపత్రం ఇస్తే బీఆరెస్ తప్పుడు ప్రచారం
- అతిథులకు మర్యాద ఇవ్వడం మన సంస్కృతి
- కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
- బీఆరెస్ కాదు అది.. బిల్లా రంగా సమితి
- చేపల పులుసుకు ఆశపడి కృష్ణా జలాలను
- రాయలసీమకు తాకట్టు పెట్టిన కేసీఆర్
- మహబూబ్నగర్ సభలో సీఎం రేవంత్రెడ్డి
- ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పీసీసీ చీఫ్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కేసీఆర్ అనే దుర్మార్గుడి పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రo అన్ని రంగాల్లో సర్వనాశనం అయిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీతో అయినా కేసీఆర్ లాంటి కేడీతోనైనా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేడీ, మోదీ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘కేసీఆర్.. విను.. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం ఉంటది.. పేదలకు అండగా ఉంటది. నాకు వయసుంది.. ఓపిక ఉంది. ఎవరైనా అటూ ఇటూ చేస్తే తోక కత్తిరించేందుకు కత్తెర నా జేబులో ఉంది’ అన్నారు.
బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా దీవెన పేరుతో నిర్వహించిన ఎన్నికల సభలో బీజేపీ, బీఆరెస్పై రేవంత్రెడ్డి విరుచుకు పడ్డారు. పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ విధ్వంసం చేస్తే.. ఒక్కొక్క శకలాన్ని తొలగించి తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే మొదలు పెట్టామన్న రేవంత్రెడ్డి.. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ గెలవాలి.. రాహుల్గాంధీ దేశానికి ప్రధాని కావాలి.. అన్నారు. తాగితే ఒకటి, దిగితే ఇంకోటి మాట్లాడటానికి తాను కేసీఆర్ను కాదు.. నేను మీ రేవంతన్ననని చెప్పారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అవసరం
పాలమూరుకు, తుమ్మిడిహెట్టికి, మూసీ అభివృద్ధి, మెట్రోకు నిధులు ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతలకు జాతీయ హోదా ఇవ్వాలని మోదీని అడిగానని రేవంత్రెడ్డి తెలిపారు. కానీ.. బీఆరెస్ సన్నాసులు తాను మోదీని పొగిడాననిని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథులు వస్తే మర్యాద ఇవ్వడం తెలంగాణ సంస్కృతి అనే విషయం కూడా తెలియని సన్నాసులే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీతో మాట్లాడా. సీఎంగా బాధ్యతగా వ్యవహరించా. ఇది కూడా తెలియని బీఆరెస్ నాయకులు ఓర్వలేక నాపై విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు’ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు మోదీ, కేడీ.. ఎవరు అన్యాయం చేసినా చాకిరేవు పెట్టి, ఉతికి ఆరేస్తానన్నారు. తమ మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే పొరపాటేనని చెప్పారు. తానేమీ ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి, కడుపులో తలకాయ పెట్టి కాళ్లు పట్టుకోలేదని, చెవిలో గుస గుసలు చెప్పలేదని కేసీఆర్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. మనం అడిగిన సమస్యలు తీర్చకపోయినా.. మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగేదాక ఉతికే బాధ్యత నేను తీసుకుంటానని ప్రకటించారు.
పాలమూరు బిడ్డను సీఎంగా ఓర్వలేక పోతున్నారు
బీజేపీ, బీఆరెస్ నేతలు మాటిమాటికీ రాష్ట్రoలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారన్న రేవంత్రెడ్డి.. ఒక పాలమూరు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చోవడం ఆ రెండు పార్టీలకూ ఇష్టం లేదని అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని మరోసారి అంటే పాలమూరు పౌరులు అగ్గి కణికలై వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆరెస్ పదేళ్లు సాగించిన పాలనలోనే తెలంగాణ రాష్ట్రo విధ్వంసానికి గురైందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండొచ్చు.. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండచ్చు.. కానీ పేదోళ్ల ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆరునెలల్లో పడగొడుతారట. విజ్ఞులు ఆలోచన చేయాలి.. దుర్మార్గ రాజకీయాలను పాతరేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.
చేపల పులుసుకు కృష్ణా జలాలు తాకట్టు
చేపల పులుసుకు ఆశపడి రాయలసీమకు కృష్ణా జాలాలు కేసీఆర్ తరలించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంటే తమపై ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా లాంటి ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదని ఆరోపించారు. పాలమూరు జిల్లాను ఆగం చేసిన కేసీఆర్ లాంటి దుర్మార్గుడిని ఇంటికి పంపి, పాలమూరు జిల్లాకు విముక్తి కల్గించిన ఘనత ఇక్కడి ప్రజలకు దక్కిందన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి ఆకాశానికి.. అభివృద్ధి పాతాళానికి వెళ్లాయని వ్యాఖ్యానించారు.
బిల్లా, రంగా సమితి
హరీశ్, కేటీఆర్ను చూస్తుంటే బీఆరెస్ కాదు.. బిల్లా రంగా సమితిలా కనిపిస్తోందని రేవంత్ ఎద్దేవా చేశారు. పదవి పోయి మతి భ్రమించి బీఆరెస్ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని అవహేళన చేశారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే ఆరోగ్యం బాగాలేదని హరీష్ చెబుతుండు. ఆరోగ్యం బాగలేనోడు మరి నల్లగొండ సభకు ఎట్ల పోయిండు?’ అని రేవంత్ ప్రశ్నించారు. బీఆరెస్తో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్.. ‘మొన్నటి వరకు దొరల గడీలను బద్దలు కొడతానాన్న మిత్రుడు ప్రవీణ్ దొర పంచన చేరిండు.. అలాంటి వ్యక్తి మన పాలమూరు గౌరవం నిలబెడతాడా?’ అని ప్రశ్నించారు. పదేళ్లయినా మోదీ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
మూడు నెలల్లో 30వేల కొలువులు
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిని ప్రజలు దీవించాలనికోరారు. ఈ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పర్ణిక, శ్రీహరి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, నారాయణ రెడ్డి, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, శంకర్, మేఘ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, నాయకులు ఓబేదుల్లా కొత్త్వాల్, సరిత తదితరులు పాల్గొన్నారు.