కేసీఆర్ కర్ణాటక రండి.. మా పథకాలు అమలును చూడండి: సీఎం సిద్ధరామయ్య
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవిధంగా అమలు అవుతున్నాయో పరిశీలించి నిర్థారణ చేసుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మరోసారి కర్ణాటక రావాలని కేసీఆర్ ని ఆహ్వానిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు

- కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ఆరోపణలు
- కర్ణాటక పేరిట దొంగ ధర్నాలు
- కర్ణాటక సీఎం సిద్దరామయ్య
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు అవుతున్నాయో పరిశీలించి నిర్థారణ చేసుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆహ్వానించారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ మోసం చేయదేని, ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుందని చెప్పారు. మొన్న ప్రచారానికి వచ్చినప్పుడే కర్ణాటక వచ్చి, అక్కడ తాము అమలు చేస్తున్న పథకాలను చూడాలని చెప్పామని గుర్తు చేశారు. ఆహ్వానించినా అప్పుడు రాకుండా.. కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయకావటం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నామని తెలిపారు. జూన్ 11న శక్తి యోజన, ఆ తరువాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నభాగ్య ద్వారా ఒక్కరికి 5 కేజీల బియ్యం, జూలై మొదటి వారం నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఎఫ్సీఐ కర్ణాటకకు బియ్యం ఇవ్వక పోవడంతో కేజీకి రూ.34 చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. అన్న భాగ్య ద్వారా 4.37 కోట్ల మంది పేదలకు లబ్ది జరుగుతోందన్నారు. 4 వ గ్యారెంటీ యువనిధి పథకాన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని తెలిపారు.
165 హామీల్లో అమల్లో 158
కాంగ్రెస్ ఇచ్చిన 165 హామీల్లో ఇప్పటికే 158 అమలు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 600 హామీల్లో 10 శాతం మాత్రమే అమలు చేసిందన్నారు. స్కీమ్లు అమలు చేస్తే కర్ణాటక దివాలా తీస్తుందని మోదీ అంటున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. స్కీమ్స్ అమలు చేయడానికి డబ్బులకు కొదవ లేదని స్పష్టం చేశారు.
వందశాతం ఆరు గ్యారెంటీల అమలు
తెలంగాణలో వందశాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వెంటనే 6 గ్యారంటీ స్కీమ్స్ కచ్చితంగా అమలు చేస్తామని సిద్ధరామయ్య తెలిపారు. యడ్యురప్పను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించినప్పటి నుండి ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని సిద్దిరామయ్య అన్నారు. బీజేపీ పై 40 శాతం కమిషన్ ఆరోపణ కాంగ్రెస్ది కాదని, కాంట్రాక్టర్లదని చెప్పారు. ఆ ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. దశలవారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం రాక ముందు రూ. 430 గ్యాస్ ఉంటే.. ఇప్పుడు రూ. 1200 అయిందన్నారు.
కర్ణాటక పేరుతో తెలంగాణలో దొంగ ధర్నాలు
తెలంగాణ లో ధర్నా చేసింది కర్ణాటక రైతులు కాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక రైతులు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్కు భయం పట్టుకుందని, అందుకే కర్ణాటక పేరుతో బీఆరెస్ రైతులతోనే ధర్నా చేయించారని ఆరోపించారు. డిసెంబర్ 3 న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు.