విధాత: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 శుక్రవారం నాడు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంచిర్యాల పట్టణంలో నిర్వహిస్తున్న భారీ భారత్ సత్యాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేయడానికి భారీ ఎత్తున తరలి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ సభకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , ఏఐసీసీ సెక్రెటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే లతో పాటు సీనియర్ నాయకులు అందరూ హాజరవుతారని తెలిపారు.
దేశ ప్రజల సంపదను అధానికి దారాదత్తం చేస్తున్న తీరుపై రాహుల్ గాంధీ నిలదీయంతో పాటు హిడెబర్గ్ నివేదిక ఆధారంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం రాహుల్పై కక్ష సాధింపుచర్యలకు పాల్పడిందన్నారు.
ఈ మేరకు ఏఐసీసీ అగ్రనేత మన ప్రియతమ నాయకులు రాహుల్ పై బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసిందన్నారు.ఈ కేసును సాకుగా చూపి ఆయనపై అనర్హత వేటు వేసి ఒక్క రోజు లోనే ఇంటిని సైతం ఖాళీ చేయించి భారీ కుట్రకు తెరలేపారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాహుల్ గాంధీకి మద్దతుగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.
నాయకులు, కార్యకర్తలు కృతనిశ్చయంతో పనిచేసి, ప్రజలను భాగస్వాములను చేసి ఈ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. నాయకులు కార్యకర్తలు భారీగా జన సమీకరణ చేసి మంచిర్యాల సభకు తరలిరావాలని రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు