సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్కు పటిష్ట భద్రత : కమిషనర్ తరుణ్ జోషి
మార్చి 27న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్నది

విధాత: మార్చి 27న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి డీసీపీలు, ఏసిపిలు అలాగే సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ హైదరాబాద్లో జరుగనున్న మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన అన్ని విధాల భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని ఐపీఎల్ నిర్వహణ బృందానికి సూచించారు.
పార్కింగ్ ఏర్పాట్లు, సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని తెలిపారు.