లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే జోరు? ఆరు స్థానాల్లో ప్రైవేటు సంస్థ సర్వే

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే జోరు? ఆరు స్థానాల్లో ప్రైవేటు సంస్థ సర్వే
  • ఆరింటిలోనూ కాంగ్రెస్‌దే విజయం!
  • అందులో ఒకటి కాంగ్రెస్‌ సిటింగ్‌ స్థానం
  • మరో బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్నది
  • ప్రతి చోటా 40శాతానికి పైగానే ఓట్లు!
  • బీఆరెస్‌కు చేజారనున్న 4 ఎంపీ సీట్లు


విధాత: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాణక్య పొలిటికల్‌ కన్సల్టెన్సీ తెలంగాణలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసింది. ఆరింటిలోనూ కాంగ్రెస్‌ విజయానికి తిరుగులేని అవకాశాలు ఉన్నయని సర్వేలో వెల్లడైంది ఈ వివరాలను ‘ఎక్స్‌’లో చాణక్య పొలిటిక్‌ కన్సల్టెన్సీ పంచుకున్నది. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని, ఇక్కడ ఆ పార్టీకి 42.3 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.



బీఆరెస్‌కు, బీజేపీకి చెరొక 19.2 శాతం ఓట్లు లభించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అయితే.. మరో 19.2 శాతం మంది ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పారని సర్వే తెలిపింది. ఇక్కడ ప్రస్తుతం బీఆరెస్‌ తరఫున రంజిత్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఈసారి సికింద్రాబాద్‌ సీటు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉన్నదని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కు ఇక్కడ 28.7% ఓట్లు లభిస్తాయని, బీజేపీకి 26%, బీఆరెస్‌కు 22% ఓట్లు రావొచ్చని అంచనా వేసింది.



అయితే.. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పినవారు 23.3 శాతం ఉండటం గమనార్హం. ఏ పార్టీ గెలుస్తుందనేది వీరు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అర్థమవుతున్నది. ఎస్సీ రిజర్వుడు నాగర్‌కర్నూల్‌ స్థానంలో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నదని సర్వేను బట్టి తెలుస్తున్నది. ఇక్కడ ఆ పార్టీకి సానుకూలంగా 42.8 శాతం మంది ఉన్నారు. బీఆరెస్‌కు 21.1%, బీజేపీకి 7.9% శాతం ఓట్లు రావచ్చొని సర్వే అంచనా వేసింది. మరో 28.3 శాతం మంది ఇంకా తేల్చుకోలేదని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం బీఆరెస్‌ తరఫున పీ రాములు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.



మహబూబ్‌నగర్‌ సీటు కూడా బీఆరెస్‌ చేజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆరెస్‌ తరఫున మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 41.8 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. బీఆరెస్‌కు 20.7%, బీజేపీకి 9.6% ఓట్లు రావచ్చని సర్వే తెలిపింది. ఇక్కడ ఇంకా తేల్చుకోలేక పోతున్నవారు 27.9శాతం ఉన్నారని తెలిపింది.



పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి స్థానంలో కాంగ్రెస్‌కే ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ.. ఏ పార్టీకి ఓటు వేయాలో ఇంకా తేల్చుకోనివారు అధిక సంఖ్యలో… 33.1 శాతం ఉన్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా 35.7% మంది ఉంటే.. బీఆరెస్‌కు ఓటు వేస్తామని 19.5%, బీజేపీని గెలిపిస్తామని చెప్పినవారు 11.7% ఉన్నారు. జహీరాబాద్‌ స్థానం కూడా బీఆరెస్‌ చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.



ఇక్కడ కాంగ్రెస్‌కు విస్పష్టమైన మెజార్టీ లభిస్తుందని సర్వే పేర్కొన్నది. కాంగ్రెస్‌కు 50.0% ఓట్లు లభిస్తాయని తెలిపింది. బీఆరెస్‌కు 28.0%, బీజేపీకి 5.0% ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక్కడ ఇంకా ఏమీ నిర్ణయించుకోనివారు 17.0% ఉన్నారు. ఈ స్థానం నుంచి ప్రస్తుతం బీఆరెస్‌కు చెందిన బీబీపాటిల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌కు 12 నుంచి 16 ఎంపీ సీట్లు లభించే అవకాశం ఉన్నదని సర్వే పేర్కొన్నది. బీజేపీకి 0-2, బీఆరెస్‌కు 1-4 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తెలిపింది.