దుబాయ్ లో జరుగుతున్న కాప్-28 సదస్సు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సాగుతోంది
విధాత: దుబాయ్ (Dubai) లో జరుగుతున్న కాప్-28 (COP-28) సదస్సు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సాగుతోంది. చరిత్రలో తొలిసారి పెరుగుతున్న జనాభా, వారి ఆహారపు అలవాట్లు ఉష్ణోగ్రతల పెరుగుదల (Global Warming) కు కారణమని దేశాధినేతలు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇప్పటికే వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న దేశాలకు.. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి 420 మిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శిలాజ ఇంధనాలను మండిస్తూ.. బూడిదవుతున్న అగ్నిగోళాన్నికాపాడలేరని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్.. ప్రపంచదేశాధినేతలను ఉద్దేశిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెట్రోల్, బొగ్గు వంటి ఇంధనాలతో కాకుండా సంప్రదాయేతర వనరులతో విద్యుదుత్పత్తి చేయడంపై సదస్సులో చర్చ జరిగింది.
అందుకు అనుగుణంగా అమెరికా, జపాన్, కొన్ని యురోపియన్ దేశాలు సహా 20 దేశాలు 2050 కల్లా అణు విద్యుదుత్పత్తిని ఇప్పుడున్న దానికంటే మూడింతలు చేయాలని నిర్ణయించాయి. అలాగే పేద దేశాలు పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి వీలుగా లాస్ అండ్ డ్యామేజ్ నిధిని ఏర్పాటు చేయడం ఈ సదస్సు ప్రధాన విజయమని ఆతిథ్య దేశం యూఏఈ ప్రకటించింది.
ఈ నిధి కోట్ల మంది పేదలను వాతావరణ మార్పుల దుష్ఫలితాల నుంచి కాపాడుతుందని సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న డా.సుల్తాన్ అల్ జబీర్ వెల్లడించారు. ఈ ఫండ్కు ఇటలీ 108 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ సమస్యను ఎదుర్కోవడంపై వివిధ మార్గాలను అన్వేషించడానికి గానూ పరిశోధనల నిమిత్తం గ్లోబల్ క్లైమాటిక్ సొల్యూషన్స్ అనే వేదికను ఏర్పాటు చేయగా.. దానికి యూఏఈ 30 బిలియన్ డాలర్లను విడుదల చేసింది.
2028లో భారత్లో కాప్-33 సదస్సు
కాప్-28 సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని మోదీ (Modi).. పలువురు దేశాధినేతలతో వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ఏడు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. కాప్ 28 సదస్సలో మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17 శాతం. కానీ కర్బన ఉద్గారాల్లో మా దేశ వాటా 4 శాతం మాత్రమే.
నెట్ జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో మేము చాలా ముందున్నాం. సంప్రదాయేతర వనరులతో విద్యుదుత్పత్తి అంశంలో మేము 9 ఏళ్లు ముందుగా ఉన్నాం అని పేర్కొన్నారు. గత శతాబ్దంలో పర్యావరణం విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉందని.. అందరూ కలిసికట్టుగా చిత్తశుద్ధితో కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
అందుకు అనుగుణంగా తాము 2030 కల్లా కర్బన ఉద్గారాలను 45 శాతానికి పైగా తగ్గిస్తామని, 2070 కల్లా నెట్ జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని ఛేదిస్తామని పేర్కొన్నారు. ఈ వేదికపై నుంచే ఆయన ఒక కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ రోజు ఈ వేదిక పైనుంచి ఈ పుడమి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నా. అదే గ్రీన్ క్రెడిట్ ఇనీషియేటివ్ అని పేర్కొన్నారు. పర్యావరణ హితమైన కార్యకలాపాలకే ప్రాధన్యం ఇవ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. మరోవైపు 2028లో జరగనున్న కాప్-28కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు దుబాయ్ సదస్సులో స్పష్టత వచ్చింది.