ఎమ్మెల్సీల నామినేషన్లో గవర్నర్ ద్వంద్వ నీతి
వర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేషన్లో గవర్నర్ తమిళిసై ద్వంద్వ నీతి అనుసరించారని బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ట్విటర్ వేదికగా విమర్శించారు

- బీజేపీ ఎజెండా మేరకే కాంగ్రెస్ పాలన
- మాజీ మంత్రి టి.హరీశ్ రావు
విధాత : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేషన్లో గవర్నర్ తమిళిసై ద్వంద్వ నీతి అనుసరించారని బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ట్విటర్ వేదికగా విమర్శించారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం సిఫారసు చేసిన రెండు పేర్లను జకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గవర్నర్ నిరాకరించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారన్నారు. ‘‘ఇది ద్వంద్వ నీతి కాదా ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా అని ప్రశ్నించారు.
గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆరెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని, అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారంటూ అంటూ ప్రశ్నించారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని.. కానీ బీఆరెస్కు, కాంగ్రెస్కు తేడా చూపిస్తున్నారని హరీష్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న అవగాహనను, రహస్యమైత్రిని మరోసారి బట్టబయలు చేసిందన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆరెస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమన్నారు.