హర్యానాలో లోక్సభ సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపి కూటమిలో విభేదాలు రావడంతో, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు
జేజేపీతో పొత్తు తెంచుకున్న బీజేపీ
సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం
విధాత, ఛండీఘడ్ : హర్యానాలో లోక్సభ సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపి కూటమిలో విభేదాలు రావడంతో, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. జేజేపీతో పొత్తుకు ముగింపు పలికేందుకే ఖట్టర్ సంకీర్ణ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ వెంటనే బీజేపీ అధిష్టానం సూచనలతో ఇద్దరు కేంద్ర పరిశీలకుల సమక్షంలో బీజేఎల్పీ భేటీయై తమ నూతన సీఎంగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నాయాబ్ సింగ్ సైనీని ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నకు సమాచారం ఇవ్వగా, ఈ సాయంత్రం నాలుగు గంటలకు నూతన సీఎం, మంత్రులు ప్రమాణా స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం నుంచి జేజేపీని తప్పించి ఆ స్ధానంలో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల్ని కలుపుకుని సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్కు 30, జేజేపీకి 10, ఐఎన్ఎల్డి , హర్యానా లోఖిత్ పార్టీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. వీరు కాకుండా 7 మంది స్వతంత్రులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా బీజేపీకి ఉన్న 41 మందికి తోడు స్వతంత్రుల్ని కలుపుకుంటే సరిపోతుంది.
ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు 41మంది సహా ప్రభుత్వానికి మద్దతునివ్వనున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు 6గురు అంతా ఢిల్లీలోనే ఉన్నారు. వారికి జేజేపీ అసమ్మతి వర్గం 5గురు ఎమ్మెల్యేలు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతునిస్తారని సమాచారం. ఇకపోతే లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై విభేధాలతో బీజేపీకి దూరమైన జేజేపీ నేత దుష్యంత్ చౌతలా వెంట తనతో కలిపి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో జేజేపీ 2ఎంపీ సీట్లు కోరగా, అందుకు నిరాకరించిన బీజేపీ మొత్తం రాష్ట్రంలోని 10సీట్లలో తామే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో రెండు పార్టీల మధ్య తలెత్తిన వివాదంతో జేజేపీతో పొత్తుకు గుడ్బై చెప్పి స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది.