High Court
విధాత: టిడిపి హయాంలో ఇంటలిజెన్స్ హెడ్ గా అపరిమితమైన అధికారాలు చెలాయించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహానికి గురైన ఏబి వెంకటేశ్వర రావుకు హై కోర్టులో రిలీఫ్ దక్కింది. ఆయన ఆర్జిత సెలవు మీద విదేశాలకు వెళ్ళొచ్చని చెబుతూ ఈ మేరకు ఆయనకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వాస్తవానికి తాను విదేశీ పర్యటనకు వెళ్ళాలని, దీనికి అనుమతించాలని కోరుతూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి దరఖాస్తు చేయగా దీన్ని సీఎస్ తిరస్కరించారు. దీంతో ఆయన ఏకంగా హైకోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో డీజీ ర్యాంకులో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు తన సెలవులను వాడుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏబివి టిడిపి జమానాలో వైసిపిని టార్గెట్ చేశారని, అప్పట్లో 23 మంది వైసిపి ఎమ్మేల్యేలు పార్టీ మారడానికి ప్రోత్సహించడం, టిడిపికి అనుకూలంగా అడ్డగోలుగా పనిచేశారని వైసిపి ఆరోపణ. ఈ క్రమంలోనే ఆయన్ను సస్పెండ్ చేశారు.