IND VS NZ మిడిలార్డర్ రాణించాలని కోరుకుంటున్న టీమ్ ఇండియా మేనేజ్మెంట్ దుమ్మురేపుతున్న టాపార్డర్.. బ్యాటింగ్లో మిడిలార్డర్ ఫెయిల్ విధాత: ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై ఎదురు లేకుండా టీమ్ ఇండియా దూసుకుపోతూనే ఉంది. టెస్టులు, టీ20, వన్డేలు.. ఫార్మాట్ ఏదైనా సరే విజయాలు సాధించడమే అలవాటుగా వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ లక్ష్యంగా సాగుతోంది. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-0 ఆధిక్యం అందుకున్న రోహిత్ సేన.. ఇండోర్లో జరిగే మూడో వన్డేలోనూ […]
IND VS NZ
విధాత: ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై ఎదురు లేకుండా టీమ్ ఇండియా దూసుకుపోతూనే ఉంది. టెస్టులు, టీ20, వన్డేలు.. ఫార్మాట్ ఏదైనా సరే విజయాలు సాధించడమే అలవాటుగా వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ లక్ష్యంగా సాగుతోంది. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-0 ఆధిక్యం అందుకున్న రోహిత్ సేన.. ఇండోర్లో జరిగే మూడో వన్డేలోనూ విజయంతో టీమ్ ర్యాంకింగ్స్ లో అగ్రపీఠం సాధించాలన్న పట్టుదలతో ఉంది. దీంతో నామమాత్రమైన మూడో వన్డే ఫలితంపైనా అందరిలో ఆసక్తి కలుగుతోంది..
హోరాహోరీ తప్పదు..
వన్డేల్లో న్యూజిలాండ్పై వరుస పరాజయాలకు ఈ మూడు వన్డేల సిరీస్లో టీమ్ ఇండియా బ్రేక్ వేసింది. వరుసగా కివీస్ జట్టు చేతిలో ఎదురవుతున్న పరాజయాలకు 3 వన్డేల సిరీస్లో రోహిత్ సేన బ్రేక్ వేసింది. తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో విజయం అందుకోగా.. రాయ్ పూర్లో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించి 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
సిరీస్లో చివరి వన్డే మంగళవారం ఇండోర్లో జరుగనుంది. అనంతరం ఈ రెండు జట్లమధ్య జరిగే టీ20 సిరీస్ జరుగనున్న నేపథ్యంలో ఈ వన్డేలో విజయంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. భారత పిచ్ లపై తడబాటు నుంచి బయటపడాలని కివీస్ జట్టు భావిస్తుండగా.. క్లీన్ స్వీప్ దిశగా సాగాలని భారత్ కోరుకుంటోంది. దీంతో రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాప్ హిట్.. మిడిల్ ఫట్..
కివీస్తో జరుగుతున్న సిరీస్లో భారత టాపార్డర్ సూపర్ గా రాణిస్తోంది. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తుండగా.. యువ సంచలనం శుభ్ మన్ గిల్ సూపర్ ఫాంతో అదర గొడుతున్నాడు. కివీస్తో జరిగిన తొలి వన్డేలో 208 పరుగులు చేసి కెరీర్లో తొలి డబుల్ సెంచరీ అందుకున్న గిల్.. రాయ్ పూర్లో జరిగిన రెండో వన్డేలోనూ లక్ష్యఛేదనలోనూ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీరోల్ ప్లే చేశాడు.
మరోవైపు మాజీ కెప్టెన్ స్టార్ విరాట్ కోహ్లీ రెండు వన్డేల్లోనూ బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. రెండు సార్లు కివీస్ స్పిన్నర్ శాంట్నర్ కే వికెట్ సమర్పించుకున్నాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో వరుస సెంచరీలతో దుమ్ము రేపిన కోహ్లీ.. తాజా సిరీస్లో పరుగులు చేయలేకపోవడం జట్టును బాధిస్తోంది.
మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేలలో రాణించలేక పోవడం ఆశ్చర్యంగా మారింది. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నా.. వన్డేల్లో మాత్రం అతని బ్యాటింగ్ యావరేజ్ బిలో 30గా ఉంది. దీంతో మూడో వన్డేలో సూర్య రాణించి ఈ ఫార్మాట్ లోనూ సత్తా చాటాలని జట్టు మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. ఇక హార్దిక్ పాండ్యా కూడా మిడిలార్డల్ లో ఫెయిల్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.. వీరు ముగ్గురు కూడా రాణిస్తే భారత్ కు బ్యాటింగ్ లో సమస్యలు తీరుతాయి.
బౌలింగ్లో మార్పులు..
సిరీస్లో చివరి వన్డే కోసం జట్టు బౌలింగ్ కూర్పులో మార్పులు జరిగే అవకాశం ఉంది. తాజా బౌలింగ్ సంచలనం.. సీమ్ సింహం మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో వికెట్లతో ఇరగదీస్తుండగా.. షమీ కూడా ఫరవాలేదనిపిస్తున్నాడు. కీలక సమయంలో వికెట్లతో శార్దూల్, హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు.. చివరి వన్డేలో పేస్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. లెగ్ స్పిన్నర్ చాహల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన వీరిద్దరికీ జట్టులో చోటు దొరకొచ్చు.
ఆందోళనలో కివీస్
బ్యాటింగ్లో వైఫల్యం కివీస్ జట్టును దెబ్బతీస్తోంది. జట్టులో బ్రేస్ వెల్తో పాటు స్పిన్నర్ శాంట్నర్ మాత్రమే బ్యాటింగ్లో రాణిస్తుండడం .. సారథి లాథమ్ సహా ఫిన్ అలెన్, మిచెల్ బ్యాటింగ్ లో అట్టర్ ప్లాప్ కావడంతో సిరీస్ చేజారింది.. మూడో వన్డేలో గెలిచి వరుస పరాజయాలకు ముగింపు పలికి టీ20 సిరీస్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తున్నా.. ప్రస్తుతం వారి పరిస్థితి చూస్తుంటే ఇది అసాధ్యంగా కనిపిస్తోంది.
టీమ్ ఇండియా బౌలింగ్ ను ఎదుర్కొని క్రీజులో నిలవాలంటే కివీస్ బ్యాట్స్ మెన్ అసాధారణంగా రాణించాల్సిందే.. మరోవైపు కివీస్ బౌలర్లు కూడా టీమ్ ఇండియాను నిలువరించడంలో ఫెయిల్ అవుతున్నారు. జట్టులో లోకీ ఫెర్గూసన్, శాంట్నర్ మినహా ఎక్స్ పీరియన్స్ బౌలర్లు లేరు. దీంతో ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లోనూ న్యూజిలాండ్ జట్టు సమస్యలు ఎదుర్కొంటోంది. దీంతో ఇండోర్లో జరిగే మూడో వన్డేలోనూ విజయం అందుకోవడం అసాధ్యమే అనిపిస్తోంది..