Vande Bharat Express | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి మండి ఆదరణ లభిస్తుండడంతో మరో రెండు మార్గాల్లో నడిపించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ సైతం పూర్తి చేసింది. అదే సమయంలో మరికొన్ని రూట్లలోనూ సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం కాచిగూడ - యశ్వంత్పూర్, విజయవాడ - చెన్నై మార్గంలో కొత్తగా రెండు రైళ్లను […]
Vande Bharat Express |
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి మండి ఆదరణ లభిస్తుండడంతో మరో రెండు మార్గాల్లో నడిపించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ సైతం పూర్తి చేసింది. అదే సమయంలో మరికొన్ని రూట్లలోనూ సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తున్నది.
ప్రస్తుతం కాచిగూడ – యశ్వంత్పూర్, విజయవాడ – చెన్నై మార్గంలో కొత్తగా రెండు రైళ్లను ప్రారంభించేం దుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటితో పాటు విశాఖపట్నం – భువనేశ్వర్ మధ్య మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. అయితే, రైల్వేశాఖ కొత్తగా వందే భారత్ రైళ్లను భారీగా ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఒకేసారి భారీ సంఖ్యలో రైళ్లను ప్రారంభించేందుకు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రైల్వేశాఖ తాజా ప్రణాళిక నేపథ్యంలో కొత్తగా ప్రారంభించాల్సిన రైళ్ల ప్రారంభోత్సవానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాచిగూడ – యశ్వంత్పూర్, విజయవాడ – చెన్నై మార్గాల్లో వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 15న కాచిగూడ – యశ్వంత్పూర్ రైలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇందు కోసం రైలు జులై 31న చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి కాచిగూడ స్టేషన్కు చేరుకుంది.
డోన్ నుంచి కాచిగూడ వరకు అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. దాంతో పాటు చెన్నై – విజయవాడ రైలు ప్రారంభోత్సవం సైతం వాయిదా పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30లోపు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే, సెమీ హైస్పీడ్ రైళ్లను వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో తీసుకురావాలని, అదే సమయంలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నాలుగు రైళ్లను వాయిదా వేయినట్లు తెలుస్తున్నది.
పార్లమెంట్ ఎన్నిలకు సమయం దగ్గరపడుతున్నది. అదే సమయంలో పలు రాష్ట్రాల్లోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్రైళ్ల ప్రారంభోత్సవాన్ని ప్రధాన ఆకర్షణగా ప్రజల ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రాబోయే రెండేళ్లలో 100 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భావించినా.. ఆ సంఖ్యను వీలైనంత త్వరగా రైల్వేలో ప్రవేశపెట్టాలని తాజాగా నిర్ణయించింది.
ప్రస్తుతం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రైళ్లను వాయిదా వేసి.. వీటికి మరికొన్నింటిని అదనంగా చేర్చి ఒకేసారి ప్రారంభోత్సవం చేయాలని కేంద్రం భావిస్తున్నది. కొత్తగా మినీ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని, ఆ తర్వాత ఉత్పత్తికి అనుగుణంగా అదనంగా కోచ్లను జత చేయాలని కేంద్రం, రైల్వేశాఖ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.