తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదన్న నిబంధన కారణంగా తొలి రోజు పలు కేంద్రాల్లో పలువురు విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు. ట్రాఫిక్ సమస్యలు, సకాలంలో వాహన వసతి లభించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో వారు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో నిమిషం నిబంధన మేరకు వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు.
హైదరాబాద్, నాగార్జున సాగర్, హాలియాలలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించలేదు. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఇంటర్ విద్యార్థి విష్ణువర్ధన్ బైక్పై పరీక్ష కేంద్రానికి వెలుతూ ఆగివున్న బస్సును వెనుక నుంచి ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమై పరీక్షకు దూరమయ్యాడు. గాయపడిన అతడిని అదిలాబాద్ రిమ్స్ తరలించారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేసింది.
మొదటి, రెండవ సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 4,78,718, రెండో సంవత్సరంలో 5,02,260 మంది హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా కాపీ కొట్టినా.. ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.