అరకు ప్రకృతి అందాలను చూసొద్దాం రండి..! పర్యాటకులకు ఐఆర్సీటీసీ బంపర్ ప్యాకేజీ..!
ప్రకృతి అందాలకు నెలకు అరకు. మంచుదుప్పటి కప్పుకున్న పర్వతాల సోయగాలు, మంచుబిందువుల తడికి మెరిసిపోయే పచ్చని చెట్లు.. గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడు వ్యవసాయం ఇలా ప్రకృతి దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తాయి

విధాత: ప్రకృతి అందాలకు నెలకు అరకు. మంచుదుప్పటి కప్పుకున్న పర్వతాల సోయగాలు, మంచుబిందువుల తడికి మెరిసిపోయే పచ్చని చెట్లు.. గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడు వ్యవసాయం ఇలా ప్రకృతి దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తాయి. ప్రకృతి అందాలు, వంతెనల మీదుగా సాగే రైలు ప్రయాణం సందర్శకులను కట్టిపడేస్తుంది. చాలా మంది కుటుంబంతోనైనా, స్నేహితులతోనైనా కలిసి వెళ్లాలని భావిస్తుంటారు.
ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకును చలికాలంలో సందర్శిస్తే ఆ మజానే వేరు. ఒకే రోజులో అరకు అందాలను చుట్టి రావాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ పేరుతో సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ నెల 6న ప్యాకేజీ నుంచి 24 వరకు అందుబాటులో ఉన్నది.
పర్యటన ఇలా..
ఉదయం 6.45 గంటలకు విశాఖపట్నంలోని రైల్వేస్టేషన్ నుంచి పర్యటన మొదలవుతుంది. పర్యాటకులు 08551 నంబరు గల రైలును ఎక్కాల్సి ఉంటుంది. ఉదయం 10.55 గంటలకు రైలు అరకు చేరుకుంటుంది. అక్కడ గిరిజన మ్యూజియంతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం లంచ్ ఉంటుంది. లంచ్ పూర్తికాగానే విశాఖ తిరుగు ప్రయాణం ఉంటుంది. తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో పర్యటన ముగియనున్నది.
ప్యాకేజీ ధరలు..
ప్యాకేజీలో మూడు కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి. ఈసీ క్లాస్లో పెద్దవారికి రూ.4450, పిల్లలకు రూ.4,080 ధర నిర్ణయించారు. ఎస్ఎల్ క్లాస్లో పెద్దలకు 2,285 కాగా.. పిలలకు రూ.1,915 చెల్లించాల్సి ఉంటుంది. మూడో క్లాస్ 2ఎస్లో పెద్దలకు రూ.2130.. పిల్లలకు రూ.1760 చెల్లించాల్సి ఉంటుంది. అరకులో పలు ప్రాంతాలను సందర్శించడానికి నాన్ ఏసీ బస్సులతో పాటు మీల్స్, బ్రేక్ ఫాస్ట్, బొర్ర గుహల ఎంట్రీ ఫీజు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ ప్యాకేజీలోనే కవరవుతాయి.
అయితే, ప్యాకేజీ బుక్ చేసుకున్న టికెట్లపై క్యాన్సిలేషన్ పాలసీని సైతం ఐఆర్సీటీసీ అందిస్తున్నది. పర్యటనకు 15 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఒక్కో ప్రయాణికుడికి రూ.250 చొప్పున కట్ చేసి మిగతా అమౌంట్ను రీఫండ్ చేస్తారు. 8 రోజుల నుంచి 14 రోజుల మధ్య 25శాతం, 4 నుంచి 7 రోజుల మధ్య అయితే 50 శాతం కట్ చేస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు క్యాన్సిల్ చేసుకునే వీలుండదు. వివరాల కోసం ఐఆర్టీసీ టూరిజం వైబ్సైట్లో సంప్రదించాలని కోరింది.