ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను నిలయమైన ఇటలీ (Italy)లో ఒక కట్టడం కాలగర్భంలో కలిసిపోనుంది.
విధాత: ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను నిలయమైన ఇటలీ (Italy)లో ఒక కట్టడం కాలగర్భంలో కలిసిపోనుంది. ఇక్కడి బోలోగ్నా సుమారు 1000 ఏళ్ల నుంచి కాస్త వంగి కూడా నిటారుగా నిలుచున్న గ్రాండ్ సెండా టవర్ (లీనింగ్ టవర్) కూలిపోయే స్థితికి వచ్చిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. చుట్టుపక్కల నివసించే వారి ప్రాణాలకు ప్రమాదం లేకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 150 అడుగుల ఈ టవర్ 14 వ శతాబ్దం నుంచీ నాలుగు డిగ్రీల వంపుతో ఉండేది.
అయితే ఇప్పుడు అది అయిదు డిగ్రీలకు చేరుకుందని తెలుస్తోంది. దీనిని సురక్షితంగా ఉంచడానికి.. కూలిపోకుండా నిలబెట్టడానికి ఇటలీ ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి కాపాడకుంటూ వస్తోంది. దీని వంపు కోణాన్ని గుర్తించేందుకు 2019లో సెన్సర్లను అమర్చారు. వాటి సమాచారం ఆధారంగానే ఈ టవర్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని గుర్తించినట్లు సైంటిఫిక్ కమిటీ ఛైర్మన్ పేర్కొన్నారు.
అక్టోబరులోనే తమకు పరిస్థితి అర్థమైందని.. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. టవర్ బేస్మెంట్ వద్ద ఒత్తిడి బాగా పెరిగిపోవడంతో.. కూలిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దీని చుట్టూ ఒక లోహపు భాగాన్ని చుట్టూ పెట్టిన అధికారులు.. అక్కడకు వెళ్లే దారులన్నింటినీ మూసేశారు.