రేవంత్ పాలన భేష్: మాజీ మంత్రి జానారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన చూస్తుంటే.. సంతోషంగా ఉందని, ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు వెళుతోందని జానారెడ్డి ప్రశంసలు కురిపించారు

- బీఆరెస్ పాలనా వైఫల్యాలను ముందే హెచ్చరించాను
- కాంగ్రెస్ కోసం కార్యకర్తగా పనిచేస్తా
- లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలి
విధాత : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన చూస్తుంటే.. సంతోషంగా ఉందని, ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు వెళుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావన కల్పిస్తుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని.. మేధావులు, ప్రజాసంఘాల, పార్టీల సలహాలు.. సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్ళు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రేవంత్ ప్రభుత్వం.. గత పరిస్థితులను వివరిస్తూ, సమస్యలు అధిగమించే ప్రయత్నం చేస్తుందన్నారు .బీఆరెస్ ప్రభుత్వంపై నేను పదేళ్ల కింద చెప్పినవే ఇప్పుడు నిజమయ్యాయన్నారు. అప్పులు, హామీలు, సంస్కారం, ప్రజాస్వామ్యం, పథకాలు వంటి అంశాలపై గత ప్రభుత్వాన్ని నేను అనాడే హెచ్చరించానన్నారు. అప్పులు, విద్యుత్ కొనుగోళ్ళు భవిష్యత్కు ప్రమాదమని నేను చెప్పింది నేడు నిజమైందన్నారు.
ఎన్నికల్లో తాను కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రంలో ప్రజాపాలన వస్తుందని తాను చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. ఈ ప్రజాపాలనలో నా వంతు పాత్ర నిర్వహిస్తానని, గతంలో నేను నాయకత్వం వహించినప్పటికీ.. ఇప్పుడు పార్టీ కార్యకర్తగా పనిచేస్తానన్నారు. నా పనితీరు ప్రతీకార్యకర్తకు ఆదర్శంగా ఉండేలా పనిచేస్తానని, నా అనుభాన్ని, సలహాలను ప్రభుత్వానికి, ప్రజలకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమేనన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటునందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ను గెలిపించి.. ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకున్నారన్నారు. కాంగ్రెస్ను గెలిపించడానికి ప్రతి కార్యకర్త చేసిన కృషి అద్వితీయమని కొనియాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా.. ఇదే స్పూర్తితో పనిచేయాలన్నారు. అత్యధిక స్థానాలు గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇద్దామన్నారు.