అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పార్లమెంటు ఎన్నికల హామీలతో ఓట్ల కోసం మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు.
రుణమాఫీతో మరో మోసం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పార్లమెంటు ఎన్నికల హామీలతో ఓట్ల కోసం మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా, ఇప్పుడు ఆగస్టులో చేస్తామని పార్లమెంటు ఎన్నికల్లో రైతుల ఓట్లను కొల్లగొట్టే మోసానికి సీఎం రేవంత్రెడ్డి పాల్పడ్డాడని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన వరి పంట బోనస్ ఇవ్వలేదని, వచ్చే సీజన్కు ఇస్తామంటున్నారని చెప్పారు. ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని ఎద్దేవా చేశారు. రైతు స్వరాజ్య వేదిక, కాంగ్రెస్ కిసాన్ సెల్ నివేదిక మేరకు 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారన్నారు. కానీ మంత్రి ఉత్తమ్ ఆత్మహత్యలే లేవని చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడం వృధా అన్నారు. వంద రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేయనందుకు, రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వనందుకు, రూ.12 వేలు రైతు కూలీల ఖాతాలో వేయనందుకు, ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వనందుకు ఆ పార్టీకి ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలన్నారు.
కాళేశ్వరం, మేడిగడ్డ, ధరణి, డ్రగ్స్ మాఫియా, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ అవినీతిపై గత పాలకులపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాకా ఒక్కరినైనా శిక్షించడానికి చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. గతంలో బీఆరెస్ నేతలు అవినీతిపరులన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆరెస్, బీజేపీ ఒక్కటే అని అపోహ సృష్టించి లాభపడ్డారని, ఇప్పుడు తెలంగాణలో బీఆరెస్ పూర్తిగా బలహీనపడిందని, కారు పూర్తిగా ధ్వంసమైతే దాన్ని జాకీ పెట్టి లేపడానికి సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.